కరోనా మమ్మారి ప్రపంచాన్ని కప్పివేసింది. లాక్ డౌన్ తో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా సినీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. కేంద్రం నిబంధనలు సడలింపులు ఇవ్వడంతో సినీ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు సినీ పెద్దలు ఫ్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి బృందం భేటీ కానుంది. లాక్డౌన్ నిబంధనలకు భారీ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో సినిమా, టీవీ సీరియల్ షూటింగ్లకు అవకాశం ఇవ్వాలని చిత్ర పరిశ్రమ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ సర్కార్ షూటింగ్స్ నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది. దీంతో చిరంజీవి నేతృత్వంలో.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సినీ బృందం ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం కానుంది. చిరంజీవితో పాటు అక్కినేని నాగార్జున, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, జీవిత, నిర్మాత సి.కళ్యాణ్ తదితర సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.