తెలంగాణలో నిరుద్యోగులకు శక్కర్ వార్త.. రాష్ట్ర బడ్జెట్ లో నిరుద్యోగ భృతి చేర్చే అవకాశం

|

Feb 05, 2021 | 12:22 PM

లంగాణ రాష్ట్ర బడ్జెట్‌ రెడీ అవుతుంది. ఆర్థికవేత్తలను సంప్రదిస్తూ బడ్జెట్‌ పద్దు కూర్పులో సీఎం కేసీఆర్‌ బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో ఎంతో..

తెలంగాణలో నిరుద్యోగులకు శక్కర్ వార్త.. రాష్ట్ర బడ్జెట్ లో నిరుద్యోగ భృతి చేర్చే అవకాశం
Follow us on

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ రెడీ అవుతుంది. ఆర్థికవేత్తలను సంప్రదిస్తూ బడ్జెట్‌ పద్దు కూర్పులో సీఎం కేసీఆర్‌ బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో ఎంతో నిరాశగా ఉన్న నిరుద్యోగుల పట్ల సర్కార్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలుసుంది. ఈసారి బడ్జెట్‌ కూర్పులో నిరుద్యోగభృతి చేర్చబోతున్నట్లు సమాచారం. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ అంచనాల్లో నిరుద్యోగభృతికి నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలిసారిగా నిరుద్యోగభృతి పద్దు కింద రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించే అవకాశాలున్నాయని ఆర్థికశాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ హామీ మరుగునపడిపోయింది. అయితే ఇటీవల టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ చేసిన ప్రకటనతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. నిరుద్యోగభృతిపై సీఎం కేసీఆర్‌ ఓ నిర్ణయం తీసుకుంటారని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

అయితే నిరుద్యోగ భృతి ఎవరికి ఇవ్వాలనే విధివిధానాల రూపకల్పన, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తదితర అంశాలపై త్వరలో సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఆ తర్వాతే ఈ పథకం అమలుపై మరింత స్పష్టత రానుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రభుత్వం వద్ద నిరుద్యోగుల లెక్కలు స్పష్టంగా లేవు. 10వ తరగతి నుంచి పీహెచ్‌డీ స్థాయిల్లో దాదాపు 30 లక్షలమందికిపైనే నిరుద్యోగులున్నట్టు ప్రభుత్వవర్గాలు అంచనా వేస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో 25 లక్షల మంది నిరుద్యోగులు వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ కింద తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోని నిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఉంటారని ప్రభుత్వం భావిస్తుంది. ఈ లెక్కన తొలి ఏడాది ఎంత మందికి నిరుద్యోగ భృతి కల్పంచవచ్చనే ఆలోచనల్లో ఆర్థిక నిపుణులు ఉన్నట్లు తెలుస్తుంది.

 

Read  more:

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్‌.. ఆ జిల్లాల్లో ఏకగ్రీవాలను అప్పుడే ఆమోదించొద్దని ఎస్ఈసీ ఆదేశం