దేశ ఆర్ధిక వ్యవస్థపైన, వాణిజ్య, వ్యవసాయ రంగాలపైన మోదీ ప్రభుత్వం పాటిస్తున్న విధానాలపై శివసేన శనివారం శివమెత్తింది. దేశంలోని విమానాశ్రయాలు, ఎయిరిండియా, రేల్వేల ప్రైవేటీకరణ దిశగా ఈ ప్రభుత్వం సాగుతోందని, రైతుల బతుకులను ట్రేడర్లు, ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని శివసేన తన అధికారిక పత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో దుయ్యబట్టింది. కీలకమైన అంశాలపై ఈ ప్రభుత్వం తన మిత్రపక్షాలతో గానీ, విపక్షాలతో గానీ, రైతు సంఘాలతో గానీ సంప్రదించకుండానే ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, వ్యవసాయంపై రెండు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టిందని సేన పేర్కొంది. శిరోమణి అకాలీదళ్ సభ్యురాలు హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రివర్గం నుంచి రాజీనామా చేసిన విషయాన్ని శివసేన ప్రస్తావిస్తూ.. మోదీ సర్కార్ రైతు వ్యతిరేక బిల్లులను ప్రవేశపెట్టినందుకు నిరసనగా ఆమె రాజీనామా చేశారని తెలిపింది.
ఎన్డీయే నుంచి మేం ఇదివరకే వైదొలిగాం.. ఇప్పుడు శిరోమణి అకాలీదళ్ వంతు వచ్చింది. లోగడ వాజ్ పేయి, అద్వానీల హయాంలో వారు ఈ విధమైన కీలకాంశాలపై అన్ని ప్రతిపక్షాలనూ సంప్రదించేవారని . విపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునేవారని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన గుర్తు చేసింది.