
rashi khanna in web series: లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడం, బడా నిర్మాణ సంస్థలు ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం.. కారణమేదైనప్పటికీ ఇటీవల ఓటీటీల హవా కొనసాగుతోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా ప్రేక్షకుడి అభిరుచుల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం హాలీవుడ్కే పరిమితమైన వెబ్ సిరీస్లు ఇప్పుడు భారత్లోనూ సత్తా చాటుతున్నాయి. నిర్మాణ సంస్థలు కూడా ఖర్చుకు వెనుకడుగు వేయకుండా సినిమా బడ్జెట్తో సమానంగా వెబ్ సిరీస్లకు కేటాయిస్తుండడంతో డిజిటల్ స్క్రీన్పై బడా తారలు కూడా నటిస్తున్నారు.
ఇప్పటికే తెలుగు నుంచి సమంత, తమన్నా, సాయిపల్లవిలతో పాటు పలువురు అగ్ర హీరోయిన్లు వెబ్ సిరీస్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి అందాల తార రాశీ ఖన్నా కూడా వచ్చి చేరింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ దర్శకుడు తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లో హీరోయిన్గా రాశీని ఓకే చేశారు. ఇక ఈ వెబ్ సిరీస్లో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్తో పాటు తమిళ ఇండస్ట్రీకి చెందిన విజయ్ సేతుపతితో పాటు పలువురు ప్రముఖ తారలు నటిస్తున్నారు. ఇండియాలో ఉన్న ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే క్రమంలోనే దర్శకుడు ఇలా అన్ని ఇండస్ట్రీలకు చెందిన వారిని ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ వెబ్ సిరీస్ రాశీ ఖన్నా కెరీర్కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.