టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలియకుండా.. పార్లమెంటరీ పార్టీ అనుమతి లేకుండా రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ ఉప రాష్ట్రపతికి లేఖ ఇవ్వడాన్ని టీడీపీ ఖండించింది. విలీనం కోరుతూ ఇచ్చిన లేఖ చెల్లుతుందా? లేదా? అనే దానిపై న్యాయ సలహా తీసుకుంటామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ చెప్పారు. దిల్లీలో ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, తోట సీతారామలక్ష్మితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో టీడీపీ 40శాతం ఓట్లు వచ్చాయని.. పార్లమెంట్లో ప్రజల గొంతుకను వినిపిస్తామన్నారు.
స్వప్రయోజనాల కోసమే ఆ నలుగురు ఎంపీలు పార్టీ మారారని, రాజకీయ హోదా, గౌరవం కల్పించిన పార్టీకి ద్రోహం చేయడం బాధాకరమని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. టీడీపీకి సంక్షోభాలు కొత్తేమీ కాదని.. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. బీజేపీ ఫిరాయింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో తమ గొంతుక విన్పిస్తామన్నారు. తమ సిద్ధంతాలను వదులుకోబోమని.. టీడీపీ తరఫున పోరాటాలను కొనసాగిస్తామన్నారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తామన్నారు. ప్రజలు వైసీపీకి 150 సీట్లు ఇచ్చింది రాష్ట్ర అభివృద్ధి కోసం తప్ప రాజకీయం కోసం కాదన్నారు.