కరోనా ప్రభావంతో ప్రజల జీవన విధానమే మారిపోయింది. మాస్క్ లేనిదే అడుగు బయటపెట్టలేని పరిస్థితి. కొవిడ్ బారిన పడకుండా మాస్క్ పెద్ద రక్షణ కవచంగా మారింది. మాస్కులు కూడా కొనుక్కోలేని నిరుపేదలకు సాయం అందించాలని రాజ్యసభ సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా పేదలకు ఉచితంగా ఫేస్ మాస్క్లు అందించాలని సీపీఐఎం సభ్యుడు బినాయ్ విశ్వం రాజ్యసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొవిడ్-19 మహమ్మారి ముప్పును ఎదుర్కోవడంలో సహాయపడటానికి సమాజంలోని పేద, బలహీన వర్గాలకు ఉచితంగా మాస్క్లు అందించాలని డిమాండ్ చేశారు. జీరో అవర్లో మాస్కుల సమస్యను ఎంపీ బినాయ్ విశ్వం లేవనెత్తారు. సబ్బును ఉపయోగించడం, మాస్కులు ధరించడం కొవిడ్ -19 నివారణకు ఉత్తమ చర్యలు అని ఆయన అన్నారు. జనాభాలో 30 శాతం మందికి కరోనా ప్రాబల్యం అంతగా తెలియదని, పేదరికం, నిరక్షరాస్యత కారణంగా మాస్కుల అవసరాన్ని విస్మరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వమే పేదలకు ఉచితంగా మాస్కులు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.