వివాహేతర బంధం.. హత్య కేసు ఛేదించిన పోలీసులు…

|

Aug 12, 2020 | 12:53 PM

విశాఖ జిల్లాలో పదిరోజుల క్రితం ఓ యువకుడి మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఆ కేసును పోలీసులు చేధించారు. హత్యకు గల వివరాలను పోలీసులు బయటపెట్టారు. నిందితుడిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

వివాహేతర బంధం.. హత్య కేసు ఛేదించిన పోలీసులు...
Follow us on

విశాఖ జిల్లాలో పదిరోజుల క్రితం ఓ యువకుడి మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఆ కేసును పోలీసులు చేధించారు. హత్యకు గల వివరాలను పోలీసులు బయటపెట్టారు. నిందితుడిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

పరవాడ మండలం బండారుపాలెం నుంచి ముత్యాలమ్మపాలెం వెళ్లే మార్గంలోని తోటల్లో ధర్మరాజు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని గుర్తించిన పరవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ కేసును ఎట్టకేలకు ఛేదించారు. ధర్మరాజు మృతికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. పరవాడ సీఐ ఉదయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పరవాడ మండలం నాయుడుపాలెం పంచాయతీ పరిధి హస్తినాపురం గ్రామానికి చెందిన ధర్మరాజు(40) అచ్యుతాపురంలోని ఒక కంపెనీలో కార్మికునిగా పనిచేస్తున్నాడు. అతడు భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసముంటున్నాడు. అయితే, ధర్మరాజుకు మద్యం తాగే అలవాటు ఉంది. ఇదే క్రమంలో ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయతీ పరిధి దిబ్బపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటికి సారా తాగడానికి వెళ్లేవాడు. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వారిద్దరు తరుచు ముత్యాలమ్మపాలెం-బండారుపాలెం మధ్యలోని జీడిమామిడి తోటల్లో తరచూ కలుసుకునేవారు. వీరి అక్రమ సంబంధం ఆమె భర్త కుళ్లయ్యకు తెలిసింది. దీంతో ధర్మరాజుపై పగ పెంచుకొని ఎలాగైనా ధర్మరాజును హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.

ఈనెల 2న తన భార్య నగదు, సారాయి పట్టుకొని బయటకు వెళ్లడం కుళ్లయ్య గమనించాడు. సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ పట్టుకుని చాటుగా వెంబడించాడు. జీడితోటలో ధర్మరాజు, ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని భార్యను చితకబాదాడు. కుళ్లయ్యపై ధర్మరాజు ఎదురుతిరిగాడు. దీంతో కుళ్లయ్య సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ వైరును ధర్మరాజు గొంతుకు బిగించి హత్య చేశాడు. ఈ నెల 3న తన భర్త కనిపించడం లేదని ధర్మరాజు భార్య పరవాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 6వ తేదీన ధర్మరాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చివరికి కుళ్లయ్య హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో అతనిపై హత్యకేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామని సీఐ వెల్లడించారు.