ముంబైలోని అత్యంత ఎత్తయిన మెట్రో- 6 కారిడార్ పనులు చురుకుగా సాగుతున్నాయి. 2022 నాటికి ఈ మార్గంలో మెట్రో పరుగులు తీయనుంది. ముంబై మెట్రో- 6 కారిడార్ స్టేషన్లకు సంబంధించిన పనులు 48 శాతం మేరకు పూర్తయ్యాయని మెట్రో అధికారులు తెలిపారు. ఎంఎంఆర్ పరిధిలో మెట్రో లైన్ సంబంధించి 13 కారిడార్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. మెట్రో- 6 కారిడార్ మినహా అన్ని కారిడార్లను భూమి నుంచి 16 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. స్వామి సమర్థ్నగర్ నుంచి విఖ్రోలి మధ్య నిర్మిస్తున్న మెట్రో- 6 కారిడార్ భూమి నుంచి 38 మీటర్ల ఎత్తులో నిర్మాణం పనులు సాగుతున్నాయి. ముంబైలో నిర్మిస్తున్న మెట్రో -6 ఎత్తు 13 అంతస్తుల భవనానికి సమానంగా ఉండనుంది. ఈ కారిడార్ మార్గంలో మొత్తం 778 ఫిల్లర్లను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 98 స్తంభాల నిర్మాణం పూర్తయ్యాయని మరో 58 స్తంభాల నిర్మాణం సగానికిపైగా నిర్మాణంలో ఉన్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 622 స్తంభాల నిర్మాణ పనులను త్వరలోనే చేపడుతామని తెలిపారు.
ఎంఎంఆర్డీఏ ఆధ్వర్యంలో 6వ కారిడార్ పనులు జరుగుతున్నాయి. దాదాపు 14.47 కిలోమీటర్ల పొడవైన మెట్రో- 6 కారిడార్ను నిర్మిస్తోంది. ఈ కారిడార్ లోఖండ్వాలా-జోగేశ్వరి-కంజూర్మార్గ్ మీదుగా విఖ్రోలి వరకు నిర్మాణం చేపడుతున్నారు. మెట్రో -6 లో మొత్తం 13 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్గంలో నిర్మించే కారిడార్ కోసం మొత్తం రూ .6,672 కోట్లు ఖర్చు చేస్తోంది ఎంఎంఆర్డీఏ. ఇప్పటి వరకు మెట్రో -6 స్టేషన్కు సంబంధించిన ఫౌండేషన్, పైలటింగ్ పనులు 48 శాతం మేరకు పూర్తయ్యాయి. మెట్రో -4, మెట్రో -6 కారిడార్ల స్టేషన్లను ఫుట్ ఓవర్ బ్రిడ్జి ద్వారా లింక్ చేయనున్నారు. ముంబైలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ కారిడార్ ముంబైవాసులకు ట్రాఫిక్ కష్టాలను తీర్చనుంది. అత్యంత వేగవంతంగా సాగుతున్న కారిడార్ పనులను పూర్తి చేసి 2022 నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.