
చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ నటుడు మోహన్ బాబుకు జరిమానాతో పాటు ఏడాది పాటు జైలు శిక్షను విధించింది ఎర్రమంజిల్ కోర్టు. 2010 నుంచి ఈ కేసును విచారిస్తున్న కోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించింది. అయితే వెంటనే మోహన్ బాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో.. ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఓ అధికారిక ప్రకటనను ఇచ్చారు మోహన్ బాబు.
‘‘2009లో సలీమ్ సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని దర్శకుడు వైవీఎస్ చౌదరికి చెల్లించేశాం. మా బ్యానర్లోనే మరో సినిమా చేయడానికిగానూ ఆయనకు రూ.40లక్షల చెక్ ఇచ్చాం. సలీమ్ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో వైవీఎస్ చౌదరితో తదుపరి చేయాల్సిన సినిమాను వద్దనుకున్నాం. సినిమా చేయడం లేదని వైవీఎస్ చౌదరికి చెప్పాం. అలాగే చెక్ను బ్యాంక్లో వేయొద్దని కూడా చెప్పాం. అయినా కూడా కావాలనే చెక్ను బ్యాంకులో వేసి చెక్ బౌన్స్ చేశారు. నాపై చెక్ బౌన్స్ కేసుని వేసి, కోర్టును తప్పుదోవ పట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పును మేం సెషన్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. కొన్ని ఛానల్స్లో నాపై వస్తున్న తప్పుడు ఆరోపణలను నమ్మొద్దు’’ అంటూ మోహన్ బాబు అన్నారు.