MPCA: సంచలన నిర్ణయం.. ఎంపీసీఏ మహిళా క్రికెటర్లకు నెలవారీ పెన్షన్.. పూర్తి వివరాలివే!
మహిళా క్రికెటర్లకు.. మరీ ముఖ్యంగా రిటైర్ అయిన మహిళా క్రికెటర్లకు ఆశాకిరణంగా మారారు. ఎంపీసీఏ అధ్యక్షుడు మహానార్యమన్ సింధియా. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న తాజా నిర్ణయంతో వందలాది మంది మాజీ క్రీడాకారిణులకు నెలవారీ ఆర్థిక సాయం అందనుంది. ఆ వివరాలు ఇలా..

మహిళా క్రికెటర్ల కోసం మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం మొదలుపెడుతూ.. మహిళా క్రికెటర్ల సేవలను గుర్తిస్తూ, వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎంపీసీఏ అధ్యక్షుడు మహానార్యమన్ సింధియా ప్రతిష్టాత్మకమైన ‘నెలవారీ ప్రోత్సాహక పథకాన్ని’ ప్రకటించారు. ముఖ్యంగా బీసీసీఐ పెన్షన్ పథకానికి అర్హత లేని మాజీ మహిళా క్రికెటర్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
పెన్షన్ వివరాలు(మహిళా క్రికెటర్లకు):
అంతర్జాతీయ క్రీడాకారులు: భారత్ తరపున ఆడిన వారికి నెలకు రూ. 12,500 అందజేస్తారు.
డొమెస్టిక్ ప్లేయర్స్: దేశీయ స్థాయి క్రీడాకారులకు వారి కేటగిరీని బట్టి రూ. 6,000 నుంచి రూ. 10,000 వరకు అందుతుంది.
సీనియర్ సిటిజన్స్: 75 ఏళ్లు పైబడిన మహిళా క్రికెటర్లకు అదనంగా రూ. 7,500 సహాయం అందిస్తారు.
ఈ పథకం ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. “భవిష్యత్తును నిర్మించడంతో పాటు, మాజీ క్రికెటర్లకు గౌరవం ఇవ్వడం కూడా ముఖ్యం” అని ఈ సందర్భంగా సింధియా వ్యాఖ్యానించారు.
పురుష క్రికెటర్లు, అంపైర్లకు కూడా లబ్ధి:
కేవలం మహిళలకే కాకుండా, రిటైర్డ్ పురుష క్రికెటర్లు, అంపైర్ల పెన్షన్ను కూడా ఎంపీసీఏ కమిటీ పెంచింది.
పురుష క్రికెటర్లు: ఆడిన మ్యాచ్ల సంఖ్యను బట్టి నెలకు రూ. 7,000 నుంచి రూ. 12,500 వరకు పెన్షన్ లభిస్తుంది.
అంపైర్లు: బీసీసీఐ స్థాయి అంపైర్లకు రూ. 10,000, రాష్ట్ర స్థాయి వారికి రూ. 6,500 అందుతుంది.
గౌరవ వేతనం: స్కోరర్లకు రోజుకు రూ. 2,500, సెలెక్టర్లకు రూ. 9,000, అంపైర్లకు మ్యాచ్కు రూ. 5,000 చొప్పున వేతనాన్ని పెంచారు.
Honouring the women who laid the foundation of Madhya Pradesh cricket. 🏏 MPCA introduces a Monthly Financial Assistance Initiative to recognise the invaluable contribution of former women cricketers of the state. pic.twitter.com/CzyPflMxgN
— MP Cricket Association (@MPCAtweets) April 3, 2026
