AP Government taking few more stringent steps for lock-down: ఏపీలో లాక్ డౌన్ నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్న వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. లాక్ డౌన్ పీరియడ్లో ప్రజలందరు సామాజిక దూరం పాటించాలని, రోడ్లపైకి అత్యంత అవసరమైతే తప్ప రావద్దని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి. కానీ.. తెల్లారిందంటే చాలు ఏదో ఒక కారణం చూపిస్తూ వేల సంఖ్యలో జనం రోడ్డెక్కుతున్నారు.
కూరగాయలు, నిత్యావసరాలు, మందుల పేరుతో జనం రోడ్లపైకి వస్తూ.. షాపుల వద్ద, రైతు బజార్ల వద్ద పెద్ద సంఖ్యలో సామాజిక దూరం పాటించకుండా వుంటున్నారు. దాంతో కరోనా వైరస్ వ్యాప్తికి మరింత వెసులుబాటు కలుగుతుందని, ఫలితంగా వ్యాధి బారిన పడే వారి సంఖ్య మరింత పెరుగుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే కరోనా ప్రభావం మూడో దశకు వెళుతుందని, అప్పుడు దాన్ని నియంత్రించడం కష్టమవుతుందని భావిస్తోంది. అందుకే మరిన్ని కఠిననిర్ణయాలు చేయకతప్పడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
నిత్యావసర సరుకులు ,కూరగాయల కోసం పట్టణాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు సమయం ఇవ్వాలని, గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు సమయం ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. పట్టణాల్లో నిబంధనలు బేఖాతరు చేస్తూ.. బయటకు వస్తున్న ప్రజలను మరింతగా కట్టడి చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. ప్రతి నిత్యావసర దుకాణాల వద్ద ధరలు పట్టిక పెట్టాలన్న ఆదేశాలు పట్టించుకోని దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ స్థితిగతులపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిస్థితిని సమీక్షించారు. ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అదే సమయంలో లాక్ డౌన్ అమలును మరింత కఠిన తరం చేయాలని, ఏప్రిల్ 14వ తేదీ దాకా ఈ అప్రమత్తత కొనసాగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.