టీమిండియా టీ20 స్పెషలిస్ట్ కేఎల్ రాహుల్తో టెస్టుల్లో వికెట్ కీపింగ్ చేయించాలనే ఆలోచనను భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, జట్టు యాజమాన్యం విరమించుకోవాలని మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా సూచించాడు. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ సిరీస్లో రాహుల్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడమే కాకుండా వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా నిర్వర్తించి అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. దీనితో సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టులకు కూడా అతడ్ని కీపర్గా తీసుకోవాలని కొందరు అభిప్రాయపడ్డారు. దీనిపై తాజాగా ఆకాశ్ చోప్రా స్పందిస్తూ అది సరైన నిర్ణయం కాదని తెలిపాడు.
‘సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టుల్లో వికెట్ కీపర్లను మారుస్తూ వస్తే.. దాని ప్రభావం ఆటపై ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశాడు. ప్రస్తుతం టెస్టుల్లో వికెట్ కీపింగ్ చేస్తోన్న వృద్దిమాన్ సాహాను కొనసాగించడమే మంచిదని అన్నాడు. కాగా, రాహుల్ అద్భుతమైన ఆటగాడు అని.. అతడు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా టీ20, వన్డేలలో అద్భుతంగా రాణిస్తున్నాడని కితాబు ఇచ్చాడు. టెస్టుల్లో ఛాన్స్ కోసం మరికొంత కాలం వేచి చూడాలని పేర్కొన్నాడు.