గంగమ్మ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి
హైదరాబాద్ మహానగరంలో గణేశ్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. ప్రసిద్ధ ఖైరతాబాద్ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా పూజలందుకున్న ఖైరతాబాద్ గణేషుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 3 దగ్గర మహాగణపతి నిమజ్జనం పూర్తి.

హైదరాబాద్ మహానగరంలో గణేశ్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. ప్రసిద్ధ ఖైరతాబాద్ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా పూజలందుకున్న ఖైరతాబాద్ గణేషుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 3 దగ్గర మహాగణపతి నిమజ్జనం మంగళవారం సాయంత్రం విజయవంతంగా పూర్తి అయ్యింది. మహాగణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిమజ్జనాని ముందు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల వీడ్కోలు భజనలతో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలు మార్మోగిపోయాయి. భక్తుల జయజయధ్వానాల నడుమ హుస్సేన్సాగర్లోని మూడో నంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయింది. కరోనా కారణంగా ఈసారి కేవలం 9 అడుగుల మట్టి విగ్రహాన్ని ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులు రూపొందించారు.
మరోవైపు పలు ప్రాంతాల నుంచి తరలివస్తున్న గణనాథులతో ట్యాంక్బండ్పై సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీటీవీ కెమెరాలతో కంట్రోల్ రూం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ అర్ధరాత్రి వరకు నిమజ్జనాల ప్రక్రియ కొనసాగే అవకాశముంది




