తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఒక కాలబధ్ధ వ్యవధి ప్రకారం పూర్తిగా దళాల ఉపసంహరణ జరగాలని భారత-చైనా దేశాలు నిర్ణయించాయి. వాస్తవాధీన రేఖ పొడవునా శాంతి, సుస్థిరతలను పునరుధ్ధరించాలని ఉభయ దేశాలు తీర్మానించాయి. లద్ధాఖ్ లోని పాంగాంగ్ సో నుంచి చైనా సేనల ఉపసంహరణ కొనసాగడం విశేషం. దౌత్య స్థాయిలో రెండు దేశాల మధ్య చర్చలు జరగగా.. తదుపరి చర్యలు తీసుకునే విషయమై సీనియర్ కమాండర్ల స్థాయి సంప్రదింపులు త్వరలో జరగనున్నాయి. డిస్-ఎంగేజ్ మెంట్ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలని రెండు దేశాలూ కోరుతున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం ఫోన్ లో అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ తో మాట్లాడుతూ సరిహద్దుల్లోని పరిస్థితిపై భారత వైఖరిని ప్రస్తావించారు. మరోవైపు-రెండు దేశాలూ ప్రత్యర్థులుగా కాకుండా సన్నిహిత భాగస్వాములుగా ఉండాలని చైనా రాయబారి సన్ వీ డాంగ్ ఆకాంక్షించారు. ఆయన వైఖరిలో మార్పు రావడం గమనార్హం. రెండు వేల సంవత్సరాలకు పైగా భారత, చైనా దేశాల మధ్య స్నేహ సంబంధాల చరిత్ర ఉందని ఆయన చెప్పారు.