వరంగల్ జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత 15 రోజులుగా ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. వరద పూర్తిగా తగ్గిన తర్వతే నయీంనగర్ వరద కాలువపై దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నారు అధికారులు. వరద ప్రవాహం తగ్గడంతో ములుగు – ఏటూరు నాగారం ప్రధాన రహదారిలో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.
అటు రామప్ప, పాకాల, లక్నవరం జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. వర్షం తగ్గినా 3 సరస్సులు ఇంకా మత్తళ్ళు దూకుతున్నాయి. ఇంకా ప్రమాదకర స్థాయిలోనే జలాశయాలు, జలపాతాలు కనిపిస్తున్నాయి. దీంతో అప్పుడే పర్యాటకులు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి శాంతించింది. అయితే వరద ప్రవాహం తగ్గడంతో 7 అడుగుల వద్ద నిలకడగా గోదావరి నీటిమట్టం కొనసాగుతోంది.