
కరోనా వైరస్పై రోజుకొకరు కొత్త విషయంతో మందుకొచ్చి జనాలను ఇంకా భయపెట్టిస్తున్నారు.. ఇప్పటికే కరోనా విలయతాండవాన్ని చూసి జడుసుకుంటుంటే.. ఇక అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ చీఫ్ స్కాట్ గాట్లిబ్ ఆందోళన కలిగించే వార్త చెప్పారు.. ఈ ఏడాది చివరి నాటికి, అంటే మరో మూడు నెలల్లో ప్రతి అయిదుగురు అమెరికన్లలో ఒకరికి కరోనా సోకే ప్రమాదముందన్నారు.. చలికాలంలో వైరస్తో మరింత ప్రమాదం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.. డిసెంబర్ చివరివరకు అమెరికా దేశ జనాభాలో కనీసం 20 శాతం మంది కరోనా వైరస్ బారిన పడతారని అంటున్నారు.
చలికాలంలో ఎందుకు తీవ్రంగా ఉంటుందన్నదానికి కొన్ని కారణాలు చెప్పారాయన. చలికాలంలో ప్రజలంతా ఎక్కువగా ఇళ్లల్లోనే ఉంటారని, భౌతికదూరాన్ని పాటించరని అందుకే కరోనా ముప్పు ఎక్కువన్నది గాట్లిబ్ అభిప్రాయం. ఇప్పటికే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివాటిపై విసుగు చెంది ఉన్నారని, ఇకపై నిబంధనలను పాటిస్తారన్న నమ్మకం తనకు లేదని చెప్పారు. ఈ ఏడాదిలోగా వ్యాక్సిన్ వస్తుందని తాను అనుకోవడం లేదని, కరోనా నిబంధనలను కచ్చితగా పాటించడమే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యమని గాట్లిబ్ అన్నారు.