
గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఊడిజర్ల ఎస్సీ కాలనీలో ఆగస్టు 2015లో కొంత మంది గుర్తు తెలియని వ్యాధి బారిన పడ్డారు. మొదట జ్వరం వచ్చి ఆ తర్వాత ఫిట్స్ వచ్చాయి. దీంతో స్థానిక ఆర్ఎంపీ సూచనతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.
మొదటి దాసు ఈ వ్యాధి బారిన పడగా.. తర్వాత తిరుపాల్ కూడా వ్యాధి బారిన పడ్డారు. వీరిద్దరూ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృత్యువాత పడ్డారు. చనిపోయిన వీరిద్దరి వయస్సు కూడా 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంది. ఆ తర్వాత కూడా మరో 8 మంది ఇలాంటి రోగ లక్షణాలతోనే ఆర్ఎంపీ దగ్గరికి వచ్చారు. అదృష్టవశాత్తు వారంతా కోలుకున్నారు.
ఐనా.. దాసు, తిరుపాల్ చనిపోయిన ఘటనపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. జిల్లా నుంచి గ్రామానికి చేరుకున్న అధికారులు వాటర్, మట్టి, ఆ కుటుంబం సభ్యులు తీసుకుంటున్న ఆహార పదార్ధాల నమూనాలను తీసుకెళ్లారు. అయితే.. ఇప్పటి వరకూ ఆ వ్యాధి ఏంటో? ఎందుకు చనిపోయారో? అంతు చిక్కలేదు. అయితే.. ఇప్పుడు ఏలూరులో ఫిట్స్ వ్యాధి బారిన పడటంతో.. గతంలో జరిగిన ఇలాంటి ఘటనలపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.
ఈపూరు మండలం ఊడిజర్ల ఘటనకు, ఏలూరు ఘటనకు దగ్గర సంబంధం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. తమ కుటుంబాలకు న్యాయం చేస్తామని అప్పటి అధికారులు, ప్రజా ప్రతినిధులు చెప్పినప్పటికీ తమకు ఎటువంటి నష్టపరిహారం అందివ్వ లేదంటున్నాయి బాధిత కుటుంబాలు. ఏలూరు ఘటనతోనైనా ప్రభుత్వం తమపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.