జేఈఈ మెయిన్స్ 2020 ఎంట్రన్స్ పరీక్షలో తెలంగాణ విద్యార్థులు తమ దమ్మెంతో దేశానికి చాటారు. జాతీయ స్థాయి విద్యాసంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షలో దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది విద్యార్థులు వందకు వంద శాతం స్కోర్ సాధించారు. జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రాత్రి విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తంగా 24 మంది విద్యార్థులు వందకు వంద శాతం మార్కులను సాధించారు. ఇందులో 8మంది తెలంగాణ విద్యార్థులేకాగా, మిగతావారిలో ఢిల్లీ నుంచి ఐదుగురు, రాజస్తాన్ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, హర్యానా నుంచి ఇద్దరు వందకు వంద శాతం స్కోర్ సాధించినవారిలో ఉన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో అప్పటికే రెండుసార్లు వాయిదాపడ్డ జేఈఈ పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 6 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను ఎట్టిపరిస్థితుల్లో వాయిదా వేయాలంటూ దేశంలోని బీజేపీయేతర ముఖ్యమంత్రులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించి.. గతంలో జేఈఈ పరీక్షల నిర్వహణను సమర్థిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్ను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చి.. పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ చేసింది. దీంతో ఎట్టకేలకు కేంద్రం ఈ పరీక్షలు నిర్వహించగలిగింది. జేఈఈ మెయిన్స్ కోసం దేశవ్యాప్తంగా మొత్తం 8.58 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా… ఇందులో 74శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో సెప్టెంబర్ 27న జరగనున్న జేఈఈ అడ్వాన్స్కు 2.45 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు.
Twenty-four candidates score 100 percentile in JEE (Main) exams; highest eight students from Telangana: National Testing Agency (NTA) pic.twitter.com/6EI3YNwKJ4
— ANI (@ANI) September 11, 2020