రేపటి నుంచి ఢిల్లీలో డీజిల్ జనరేటర్లపై నిషేధం..!
పర్యావరణ కాలుష్య నివారణ, నియంత్రణకు దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ జనరేటర్లను నిషేధం విధించారు.
పర్యావరణ కాలుష్య నివారణ, నియంత్రణకు దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ జనరేటర్లను నిషేధం విధించారు. ఢిల్లీలో గురువారం నుంచి డీజిల్ జనరేటర్లను వినియోగించేందుకు అనుమతి లేదు. వాయు కాలుష్య నివారణ కోసం వీటి వాడకంపై ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి నిషేధం విధించింది. గ్రేడెడ్ రెస్సాన్స్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, అత్యవసర సేవల కోసం వినియోగించేందుకు మాత్రం అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.
డీజిల్, పెట్రోలు, కిరోసిన్లతో నడిచే అన్ని కెపాసిటీల జనరేటర్ల వాడకాన్ని అక్టోబరు 15 నుంచి నిషేధిస్తున్నట్లు డీపీసీసీ పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. గ్రేడెడ్ రెస్సాన్స్ యాక్షన్ ప్లాన్ను ఢిల్లీ, దాని పరిసరాల్లోని పట్టణాల్లో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 2017లో పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన పర్యావరణ కాలుష్య నిరోధం, నియంత్రణ వ్యవస్థ దీనిని అమలు చేస్తోంది.
మెట్రో రైల్ సేవలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, రైల్వే సేవలు, విమానాశ్రయాలు, అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్స్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నడుపుతున్న డేటా సెంటర్ అత్యవసర సేవల పరిథిలోకి వస్తాయని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కౌన్సిల్ వివరించింది.