మూడంచెల్లో కరోనా ట్రేస్… జగన్ న్యూ మెథడ్ ఇదే

|

Apr 13, 2020 | 2:06 PM

ఏపీలో కరోనా సోకిన వారిని ట్రేస్ చేసేందుకు కొత్త టెక్నిక్ అమల్లోకి తెచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సోమవారం ఈ కొత్త విధానాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ విధానం ఎలా పని చేస్తుందో ఆయన రాష్ట్ర ప్రజలకు వివరించారు.

మూడంచెల్లో కరోనా ట్రేస్... జగన్ న్యూ మెథడ్ ఇదే
Follow us on

ఏపీలో కరోనా సోకిన వారిని ట్రేస్ చేసేందుకు కొత్త టెక్నిక్ అమల్లోకి తెచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సోమవారం ఈ కొత్త విధానాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ విధానం ఎలా పని చేస్తుందో ఆయన రాష్ట్ర ప్రజలకు వివరించారు. కోవిడ్‌ –19 నివారణా చర్యల్లో భాగంగా డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసన్‌‌ను ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌.. ఆ వెంటనే టెలిమెడిసన్ టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి డాక్టర్‌తో మాట్లాడారు.

ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ విధానాన్ని పటిష్టంగా, బలోపేతంగా నడపాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్యుల సంఖ్యనూ పెంచాలని చెప్పారు. ఈ కొత్త విధానానికి ‘డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్‌’గా నామకరణం చేశారు.

రాష్ట్రంలో డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్‌ అమలు కోసం ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నెంబరు 14410 కేటాయించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా సేవలందించేందుకు, ఈనెల 11వ తేదీ నాటికే 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్‌ పేర్లు నమోదు చేశారు. డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్‌లో ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఆరోగ్య సేవలు అందించనున్నది.

టెలి మెడిసిన్‌ ఉద్దేశం

కోవిడ్‌–19 కేసులను గుర్తించడం, ఐసొలేట్‌ చేయడం, పరీక్షించడం, క్వారంటైన్‌కు పంపించడం అనే మూడు అంచెల్లో ఈ కొత్త విధానం పని చేస్తుంది. ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్‌ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు అందిస్తారు. డాక్టర్లకు ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటుంది. టెక్నాలజీ టీం నుంచి టెక్నికల్‌ అసిస్టెన్స్‌ లభిస్తుంది. స్టెప్‌–1లో 14410 టోల్‌ ఫ్రీ నెంబరుకు రోగులు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాల్సి వుంటుంది. అక్కడి సిస్టమ్‌ మిస్డ్ కాల్ వచ్చిన మొబైల్‌ నెంబరును, మొత్తం వివరాలను నమోదు చేసుకుంటుంది. ఆ తర్వాత కాలింగ్ ఎగ్జిక్యూటివ్‌ రోగికి కాల్‌ చేసి, వారు ఉంటున్న ప్రదేశం, వయసు, రోగ లక్షణాల వంటి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. రోగికి ఒక గుర్తింపు సంఖ్య (ఐడీ) ఇస్తారు.

స్టెప్‌–2లో రోగి వివరాలన్నీ టెలి మెడిసిన్‌ వ్యవస్థకు కనెక్ట్‌ అయిన వైద్యులందరికీ కనిపిస్తాయి. ఆ సమయంలో డాక్టర్ల బృందంలో ఎవరో ఒకరు ఆ కాల్‌ను స్వీకరించి, కాల్‌ చేసి ఓపీ సేవలు అందిస్తారు. ఆ రోగికి నిర్వహించ వలసిన పరీక్షలు, అందించాల్సిన మందులను వైద్యులు తెలియజేస్తారు. వ్యాధి లక్షణాలను బట్టి కోవిడ్‌–19 అనుమానిత రోగులను గుర్తిస్తారు. ఆ తర్వాత ఎస్‌ఎంఎస్‌ ద్వారా చికిత్స వివరాలు రోగికి అందుతాయి. అవసరమైన సందర్భాల్లో వీడియో కన్సల్టేషన్‌ కూడా ఉంటుంది. అవసరమైతే వీరిని ఏ ఆస్పత్రికి పంపించాలి, ఎక్కడకు పంపించాలన్న దానిపై కూడా వైద్యులు నిర్ణయం తీసుకుని ఆమేరకు వారిని తరలిస్తారు.

స్టెప్‌–3లో కోవిడ్‌–19 అనుమానిత కేసుల జాబితాల రూపకల్పన జరుగుతుంది. ఆ రోగులకు అవసరమైన పరీక్షలు, క్వారంటైన్, ఐసొలేషన్‌తో పాటు చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆ జాబితాలు తయారు చేస్తారు. ఈ జాబితాలను జిల్లా అధాకారులకు పంపిస్తారు. తీసుకోవాల్సిన చర్యలన్నీ సక్రమంగా జరిగేలా చూసుకుంటారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యాధికారులకు ప్రిస్కిప్షన్లు పంపిస్తారు. ప్రతి ఒక్క రోగికి అవసరమైన ఔషథాలను ప్రత్యేకంగా ప్యాక్‌ చేసి ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు, గ్రామ వార్డు వలంటీర్ల ద్వారా రోగులకు నేరుగా ఇంటికే పంపిస్తారు. నాన్‌ కోవిడ్‌ రోగులకు కూడా మందులు అందించే కార్యక్రమం కొనసాగుతుంది.