Bihar cancels tender of mega bridge: గాల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించిన నేపథ్యంలో.. చైనాకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ షాకిచ్చారు. పాట్నాలో నిర్మించనున్న మహాత్మాగాంధీ వంతెనకు గతంలో ఇచ్చిన టెండర్ను రద్దు చేశారు. వంతెన నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు చైనాకు చెందిన రెండు కంపెనీలతో భాగస్వామ్యం ఉండటం వల్లే టెండర్ రద్దు చేశారు. భాగస్వాములను మార్చుకోమని చెప్పినా కాంట్రాక్టర్లు నిరాకరించడంతో చివరకు టెండర్నే రద్దు చేసినట్లు బీహార్ మంత్రి నంద్ కిశోర్ యాదవ్ తెలిపారు.
కాగా.. జూన్ 15న జరిగిన ఘర్షణల్లో చనిపోయిన జవాన్లలో ఐదుగురు బీహార్ కు చెందినవారు. దీంతో చైనాపై బీహారీలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఈ క్రమంలోనే గాంధీ వంతెన టెండర్ రద్దు చేశారు. త్వరలో చైనాతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను బీహార్ ప్రభుత్వం రద్దు చేసుకునే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర ఇప్పటికే చైనాతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంది.