దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా నేతలు ఘనంగా నివాళ్లులర్పిస్తున్నారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపలపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ జీవిత విశేషాలతో రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్ఆర్’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.
అంతకుముందు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ సీఎం జగన్ ట్విటర్లో పోస్టు చేశారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణం లేని మహానేత అని కొనియాడారు. ఆరోగ్య శ్రీ, 104, 108, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం తదితర పథకాల రూపంలో ప్రజల దృష్టిలో ఆయన ఇంకా జీవించే ఉన్నారని అన్నారు. వైఎస్ఆర్ జయంతిని రైతుదినోత్సవంగా జరుపుకోవడం పట్ల సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు.