ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ స్పాన్సర్షిప్ దక్కించుకొనేందుకు పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఐపీఎల్ ను దక్కించుకునేందుకు ఇప్పటికే పదికిపైగా కంపెనీలు కన్నేశాయని తెలుస్తోంది. ప్రస్తుత విలువలో సగం కన్నా తక్కువ మొత్తానికే టెండర్లు దాఖలు చేసేందుకు చూస్తున్నాయని క్రీడావర్గాలు అంటున్నాయి. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఈ గోల్డెన్ ఛాన్స్ను దక్కించుకు తీరాలని పోటీ పడుతున్నాయి.
అయితే ఐదేళ్ల వరకు టైటిల్ స్పాన్సర్గా కొనసాగేందుకు 2018లో బీసీసీఐతో వివో (తొలిగిన కపెంనీ) కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదికి రూ.440 కోట్ల చొప్పున 2022 వరకు చెల్లిస్తుంది. లాక్డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఐపీఎల్-2020… వేదికను దుబాయ్కి మార్చింది. దుబాయ్ లో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. స్పాన్సర్లు తమతోనే ఉన్నారని స్పష్టం చేసింది. చైనా వస్తు బహిష్కరణ ఉద్యమం తీవ్రంగా నడుస్తుండటంతో ఆ సెగ వివోకు తగలింది. దాంతో ఈ ఏడాది ఆ సంస్థ ఐపీఎల్లో భాగస్వామి కావడం లేదని బీసీసీఐ నిన్న (గురువారం) ప్రకటన జారీ చేసింది.
గేట్ మనీ లేకపోవడంతో ఇప్పటికే నష్టపోయిన ఫ్రాంచైజీలు వివో దెబ్బకు మరింత నష్టాల్లోకి జారుకోనున్నాయి. ఎందుకంటే టైటిల్ స్పాన్సర్ షిప్ ద్వారా వచ్చే డబ్బులో సగం అన్ని ఫ్రాంచైజీలకు సమానంగా షేర్ చేస్తారు. అయితే మరో కొత్త స్పాన్సర్ వచ్చినా అంత మొత్తం చెల్లించక పోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సగం విలువైతే అద్భుతమని, 1/3వ వంతు చెల్లించినా గొప్పేనని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ హక్కులు పొందేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే రాబోయేది దసరా, దీపావళి సీజన్ కావడమే కారణం. చాలా మంది ఆన్ లైన్ షాపింగ్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కంపెనీ ప్రచారానికి ఇదో పెద్ద వేదికగా మారుతుందని అంచనా వేస్తోంది అమెజాన్. అమెజాన్ తర్వాత ఇదే వరసలో టీమిండియా జెర్సీ స్పాన్సర్ బైజుస్, ఫాంటసీ స్పోర్ట్స్ ఫ్లాట్ఫామ్ డ్రీమ్ 11, అన్ అకాడమీ, మైసర్కిల్ 11 సహా కొన్ని సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.