కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలయ్యాయి. ఈ వైరస్.. ప్రాణాలనే కాదు.. ఉద్యోగాలను కూడా ఊడగొడుతుందట. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసిన ఈ మహమ్మారి త్వరలో కోట్ల మందిని రోడ్డు పాలు చేయనుందట. ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. అంతర్జాతీయ కార్మిక సంస్థ(I.L.O). ఐఎల్వో అంచనా ప్రకారం అసంఘటిత రంగంలో 160 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్క్ ఫోర్స్తో చూస్తే ఈ సంఖ్య సగం అని వివరించింది.
కాగా.. ఈ ప్రభావం అమెరికా, యూరప్, మధ్య ఆసియాలో ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనే 30 కోట్ల మంది ఫుల్ టైం జాబ్స్ పోతాయని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 43.6 కోట్ల చిన్న, పెద్ద కంపెనీలు మూతపడే అవకాశం ఉందని నివేదికలో ఐఎల్వో తెలిపింది. అందులో 23.2 కోట్ల హోల్ సేల్, 11.1 కోట్ల రిటైల్ పరిశ్రమలు ఉన్నాయని పేర్కొంది.
మరోవైపు.. ఫుడ్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ రంగాలపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. రెండో త్రైమాసికాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉపాధి ఏ స్థాయిలో ఉంటుందనేది అంచనా వేయొచ్చని ఐఎల్వో తెలిపింది. అన్ని రంగాలు కుదుటపడ్డాకే లేబర్ డిమాండ్, జాబ్స్ ఉనికిలో ఉంటాయని తేల్చి చెప్పింది.