భారతీయ వలస కార్మికులకు సీఐఐ-ఐబీఎఫ్ సాయం
సింగపూర్లో కరోనాతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు ఆదుకునేందుకు అక్కడి భారత పరిశ్రమల సమాఖ్య-భారత బిజినెస్ ఫోరం(సీఐఐ-ఐబీఎఫ్) ముందుకొచ్చింది. భారత్తో పాటు దక్షిణాసియా వలస కార్మికులకు రూ.86.60 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
కరోనా మహమ్మారి కల్లోలాన్ని సృష్టిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఉపాధి కోల్పోయి అష్టకష్టాలు పడుతున్నారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయ కార్మికులు చేసేందుకు పనిలేక కడుపు నింపుకోవడమే భారంగా కాలం వెల్లదీస్తున్నారు. తాజాగా సింగపూర్లో కరోనాతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు ఆదుకునేందుకు అక్కడి భారత పరిశ్రమల సమాఖ్య-భారత బిజినెస్ ఫోరం(సీఐఐ-ఐబీఎఫ్) ముందుకొచ్చింది. ఉపాధితో పాటు వారికి నిత్యావసరాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భారత్తో పాటు దక్షిణాసియా వలస కార్మికులకు సోమవారం రూ.86.60 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. సింగపూర్ భారతీయ అభివృద్ధి సమాఖ్యతో పనిచేస్తూ కార్మికుల కోసం సీఐఐ-ఐబీఎఫ్ విరాళాలు సేకరిస్తోంది. వలస కార్మికులకు కావల్సిన అవసరాలను తీర్చేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు.