టీ-20 వరల్డ్కప్పై ఆశలు వదిలేసుకున్న ఐసీసీ
ప్రపంచదేశాలలో ఓ ఆట ఆడేసుకుంటున్న కరోనా వైరస్ ఆటలనూ జడిపిస్తోంది.. నాలుగు నెలలుగా ఎక్కడా ఓ ఆటంటూ జరిగితే ఒట్టు! చివరాఖరికి విశ్వక్రీడ ఒలింపిక్స్ను కూడా జరగనివ్వకుండా చేసిందా వైరస్ భూతం
ప్రపంచదేశాలలో ఓ ఆట ఆడేసుకుంటున్న కరోనా వైరస్ ఆటలనూ జడిపిస్తోంది.. నాలుగు నెలలుగా ఎక్కడా ఓ ఆటంటూ జరిగితే ఒట్టు! చివరాఖరికి విశ్వక్రీడ ఒలింపిక్స్ను కూడా జరగనివ్వకుండా చేసిందా వైరస్ భూతం.. మరోవైపు టీ-20 వరల్డ్కప్ ఇప్పట్లో జరిగేట్టుగా లేదు.. ఎందుకంటే మెల్బోర్న్లో రోజురోజుకూ వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంది.. ఇలాంటి విపత్కర సమయంలో అక్కడ వరల్డ్కప్ను నిర్వహించడమన్నది దుస్సాహసమే అవుతుంది..
టీ-20 వరల్డ్కప్ వేదిక అయిన ఆస్ట్రేలియాలో పాజిటివ్ కేసులు బాగా పెరుగుతున్నాయి.. అన్నింటికంటే మెల్బోర్న్లోనే పరిస్థితి దారుణంగా ఉంది.. ఇప్పటి వరకు వేచి చూసే ధోరణిలో ఉన్న ఐసీసీకి కూడా ఆస్ట్రేలియాలోని పరిస్థితి భయపెడుతోంది.. మెగా టోర్నమెంట్ను వాయిదా వేయక తప్పని పరిస్థితి ఎదురయ్యింది.. రేపో మాపో ఐసీసీ నుంచి ఆ ప్రకటన కూడా రావచ్చు.. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు ఏడున్నర వేల మందికి కరోనా వైరస్ సోకింది.. వందకు పైగా చనిపోయారు.. ఇప్పట్లో అక్కడ కరోనా కట్టడి అవుతుందన్న నమ్మకం అస్సలే లేదు.. ఈ నెల 15 నుంచి స్టేడియం కెపాసిటీలో పాతికశాతం మందిని అనుమతిస్తూ క్రీడలు జరుపుకోవచ్చని ఆస్ట్రేలియా ప్రధాని చెప్పారే కానీ.. పరిస్థితి ఇంతగా విషమిస్తుందని ఆయన కూడా ఊహించి ఉండరు. ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటనతో మొదట్లో ఐసీసీ కాసింత ఆశాజనంగానే ఉన్నా.. ప్రస్తుత పరిస్థితి ఇబ్బంది కలిగిస్తోంది..
విక్టోరియా, మెల్బోర్న్లో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. ఆస్ట్రేలియా టాప్ సాకర్ లీగ్ అయిన ఏ–లీగ్ , నేషనల్ రగ్బీ లీగ్ మ్యాచ్ లను మెల్ బోర్న్ నుంచి మరో చోటకు తరలించారు. నిజానికి మెల్బోర్న్లో టీ20 వరల్డ్కప్ ఫైనల్ సహా ఏడు మ్యాచ్లు జరగాల్సి ఉంది. మెల్బోర్న్లో ఎన్ని ఆంక్షలు పెట్టినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కరోనా మాత్రం కట్టడి కావడం లేదు.. స్థానిక ప్రభుత్వం .. అధికారులు బాగానే కృషి చేస్తున్నారు కానీ ప్రస్తుతం పరిస్థితి వారి చేతుల్లోంచి జారిపోయింది.. ఇప్పుడక్కడ ఇంటర్నేషనల్ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి.. అంచేత టీ-20 వరల్డ్కప్లో పాల్గొనే జట్లు కూడా అక్కడికి వెళ్లడం కష్టమే!