బస్సును ఎవరు కనిపెట్టారు.. ఆ మూడు అక్షరాల వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా..?

Bus History: రవాణా వ్యవస్థకు వెన్నెముక వంటిది బస్సు. విద్యార్థులు, ఉద్యోగులు ఇలా లక్షలాది మందికి ఇది అత్యంత సరసమైన ప్రయాణం. అయితే ప్రతిరోజూ మనం ఎక్కే బస్సు అసలు పేరు బస్సు కాదట.. లాటిన్ భాషలోని ఒక వింత పదం నుండే ఈ పేరు పుట్టింది. 17వ శతాబ్దంలోనే మొదలైన ఈ బస్సు ప్రయాణం నేడు ఎలక్ట్రిక్ బస్సుల వరకు ఎలా ఎదిగిందనేది తెలుసుకుందాం..

బస్సును ఎవరు కనిపెట్టారు.. ఆ మూడు అక్షరాల వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా..?
Who Invented The First Bus

Updated on: Feb 16, 2026 | 8:26 AM

సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు.. పల్లె నుండి పట్టణం వరకు.. ప్రతిరోజూ లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే రవాణా వారధి బస్సు. మన నిత్య జీవితంలో అంతర్భాగమైన ఈ వాహనం గురించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అసలు బస్సు అనే పేరు ఎలా వచ్చింది? దీనికి ఫుల్ ఫామ్ ఉందా?  ఒకప్పుడు బస్సులు గుర్రాలతో నడిచేవన్న విషయం మీకు తెలుసా?మొదటి బస్సును ఎవరు కనుగొన్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

బస్సు అంటే అర్థం ఏమిటి?

మనం పిలుచుకునే BUS అనే మూడు అక్షరాల పదం ఒక లాటిన్ పదం నుండి పుట్టింది. లాటిన్ భాషలోని Omnibus అనే పదం నుండే బస్సు పుట్టుకొచ్చింది. ఓమ్నిబస్ అంటే అందరికీ అని అర్థం. అంటే అందరూ కలిసి ప్రయాణించే వాహనం అన్నమాట. కాలక్రమేణా ఆ పెద్ద పదం కాస్తా చిన్నగా మారి బస్సుగా స్థిరపడిపోయింది. సాంకేతికంగా కొందరు దీనిని బిజినెస్ ట్రాన్స్‌పోర్ట్ యూనిట్ అని పిలిచినప్పటికీ, చారిత్రక ఆధారాల ప్రకారం ఓమ్నిబస్ అనేదే దీని అసలు పేరు.

బస్సు పితామహుడు ఎవరు?

బస్సు రవాణా చరిత్ర సుమారు 360 ఏళ్ల నాటిది. 1662లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు బ్లేజ్ పాస్కల్ పారిస్‌లో గుర్రపు బండ్ల ద్వారా ప్రజా రవాణాను ప్రారంభించారు. ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటి బస్సు నమూనా. మనకు తెలిసిన ఇంజిన్‌తో నడిచే మోటరైజ్డ్ బస్సును 1895లో జర్మన్ ఇంజనీర్ కార్ల్ బెంజ్ రూపొందించారు. ఇది రవాణా రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించింది.

గుర్రపు బండ్ల నుండి ఎలక్ట్రిక్ బస్సుల వరకు..

బస్సు ప్రయాణం కాలంతో పాటు ఎన్నో మార్పులకు లోనైంది. 1820లో ఆవిరి యంత్రాలతో నడిచే బస్సులు అందుబాటులోకి వచ్చాయి. 1920లో దేశంలో బ్రిటిష్ కాలంలో బస్సు ప్రయాణం బాగా ప్రాచుర్యం పొందింది. నేడు డీజిల్, గ్యాస్ బస్సుల నుండి పర్యావరణానికి మేలు చేసే అత్యాధునిక ఎలక్ట్రిక్, స్మార్ట్ ఏసీ బస్సుల వరకు ఈ వ్యవస్థ విస్తరించింది. ఒకప్పుడు కేవలం గుర్రపు బండిగా మొదలైన ఈ ఓమ్నిబస్, నేడు అత్యాధునిక సాంకేతికతతో మన రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది.