Egypt Pyramids: ఈజిప్ట్ పిరమిడ్ల వెనుక అంతుచిక్కని రహస్యాలు.. తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు..!

| Edited By: Ravi Panangapalli

Aug 13, 2024 | 10:49 AM

అసలు ఈ అద్భుత నిర్మాణాన్ని ఎలా సాకారం చేశారన్న దానిపై ఇప్పటి వరకు పరిశోధకులు ఎన్నో ప్రతిపాదనలు తెలిపారు. 4వేల ఏళ్ల క్రితం వాళ్లు పిరమిడ్‌ నిర్మాణాన్ని ఇలా చేపట్టి ఉండొచ్చన్న ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పరిశోధకులు సరికొత్త ప్రతిపాదన చేశారు. పురాతన ఈజిప్షియన్లు 4వేల ఏళ్ల క్రితం భారీ పిరమిడ్లను...

Egypt Pyramids: ఈజిప్ట్ పిరమిడ్ల వెనుక అంతుచిక్కని రహస్యాలు.. తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు..!
Egypt Pyramids
Follow us on

ఈజిప్ట్ పిరమిడ్స్‌.. ఈ పేరువినగానే మనకు మొదట గుర్తొచ్చేది ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి. అత్యద్భుత నిర్మాణాలకు నెలవు. శాస్త్ర సాంకేతికంగా ఇంత ఎదిగిన ప్రస్తుతం ఇలాంటి నిర్మాణాలు చేపట్టారంటే ఒక అర్థం ఉంది. అదే అసలు ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలో.. అంటే దాదాపు 4వేల ఏళ్ల క్రితం ఈ అద్భుత నిర్మాణాలను ఎలా చేపట్టారన్నది ఇప్పటికే అంతు చిక్కని ఓ రహస్యమే. క్రీ.పూ. 2886-2160 నాటికి చెందిన ఇవి అత్యంత పురాతనమైన ఈజిప్టు నాగరికతకు ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. ఈజిప్టులో 700కు పైగా పిరమిడ్లు ఉన్నాయి. వీటిలో ఈజిప్టు రాజులను సమాధి చేశారు. ఈ పిరమిడ్ల నిర్మాణానికి దాదాపు వెయ్యి సంవత్సరాలు పట్టి ఉండవచ్చునని చరిత్ర కారుల అంచనా. పిరమిడ్లలో కైరో నగరానికి శివారులో గిజా దగ్గర నిర్మించినవి చాలా పెద్దవి. ఇక్కడ ప్రఖ్యాత గిజా కాంప్లెక్స్‌ సహా 31 పిరమిడ్లను ఎలా నిర్మించారన్న దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక స్పష్టమైన కారణం ఏంటన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. ఈజిప్టు పిరమిడ్స్ వెనుక అంతుచిక్కని రహస్యాలను ఛేదించేందుకు చరిత్రకారులు, పురాతన పరిశోధకలు ఎన్నో పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.వీరు ఏళ్లుగా ఈ పరిశోధనల్లో తలమునకలవుతున్నారు.

ఈజిప్ట్ పిరమిడ్స్‌ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లలో రెండు నుంచి 30 టన్నుల బరువున్న రాళ్లు ఉన్నాయి. వీటి నిర్మాణ సమయంలో ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఇంత పెద్ద రాళ్లను ఎలా పిరమిడ్ పైన పేర్చారన్నది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగా ఉంది. ప్రపంచ వింతల్లో మొదటగా చేరింది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజానే. ఆ కాలంలో భూమిపై నిర్మించిన ఎత్తైన కట్టడం ఇదే. ఈజిప్టులోని పిరమిడ్లు అన్నింటిలో అతి పెద్దదీ ఇదే. దీని ఎత్తు 481 అడుగులు. దాదాపు 800 కిలో మీటర్ల దూరంలోని క్వారీ నుంచి ఈ రాళ్లను తవ్వి ఇక్కడికి తీసుకొచ్చారని చరిత్రకారులు అంచనావేస్తున్నారు. దాదాపు 20 నుంచి 30 వేల మంది బానిసలను గ్రేట్ పరిమిడ్ ఆఫ్ గిజా నిర్మాణం కోసం ఉపయోగించుకున్నట్లు చెబుతారు. దీన్ని నిర్మించేందుకు దాదాపు 10 నుంచి 20 ఏళ్లు పట్టి ఉండొచ్చట. ఇది పునాదుల భాగంలో దాదాపు ఆరు లక్షల చదరపు అడుగుల మేర విస్తరించింది. ‘ది గ్రేట్ సింహిక’ అనేది 73 మీటర్ల పొడవు, 20 మీటర్ల ఎత్తు ఉన్న విగ్రహం. ఇది ఒకే రాతితో చెక్కబడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకైక రాతి విగ్రహంగా చెబుతారు. కానీ ఈ విగ్రహం ఎవరి కోసం తయారు చేశారో ఇప్పటి వరకు ఎవరికి తెలియని అంశంగానే ఉంది.

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈజిప్ట్‌లోని పిరమిడ్‌లు మృతదేహాల సంరక్షణ కోసం నిర్మించబడినప్పటికీ నేలమాళిగలో రాజు మమ్మీ/రాణి మమ్మీ ఇప్పటి వరకు కనుగొనబడలేదు. గిజా పిరమిడ్ల లోపల ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటుంది. బయట ఎంత వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా లోపల ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌ మాత్రమే ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత ఎలా నియంత్రణలో ఉంటుందన్నది కూడా మిస్టరీనేగానే ఉంది.

అసలు ఈజిప్ట్ పిరమిడ్స్ అద్భుత నిర్మాణాన్ని ఎలా సాకారం చేశారన్న దానిపై ఇప్పటి వరకు ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి. 4వేల ఏళ్ల క్రితం వాళ్లు పిరమిడ్‌ నిర్మాణాన్ని ఇలా చేపట్టి ఉండొచ్చన్న అంశంపై కొత్త విశ్లేషణలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పరిశోధకులు సరికొత్త విశ్లేషణ చేశారు. పురాతన ఈజిప్షియన్లు 4వేల ఏళ్ల క్రితం భారీ పిరమిడ్లను ఎలా నిర్మించారనే దానిపై ఈజిప్టు శాస్త్రవేత్తలు విశ్లేషించే ప్రయత్నంచేశారు. ఇటీవల ఇంజనీర్లు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని పీఎల్‌ఓస్‌ వన్‌లో ప్రచురించారు. పురాతన పిరమిడ్‌ మధ్యలో రాళ్లను ఎలా పైకెత్తారన్న దానిపై పరిశోధకులు కొత్త థియరినీ వెల్లడించారు. సుమారు 300 కిలోల బరువున్న రాళ్లను గాల్లోకి ఎత్తడానికి ఆ సమయంలో హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ వ్యవస్థను ఉపయోగించి ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.

Egypt Pyramids2

సహజ వనరుల సాయంతో..

పెద్ద పిరమిడ్‌లను నిర్మించడంలో ర్యాంప్‌లు, క్రేన్‌లు, వించ్‌లు, పివోట్లు వంటి సాంకేతికతను వినియోగించి ఉండొచ్చని ప్రముఖ పరిశోధకుడు ల్యాండ్‌రూ తెలిపారు. స్థానికంగా ఉన్న సహజ వనరులను ఉపయోగించే పిరమిడ్ రాళ్లను పైకి ఎత్తారని నిపుణులు చెబుతున్నారు. వాటర్‌ పవర్‌తో నడిచే ఎలివేటర్స్‌ను ఇందుకోసం ఉపయోగించి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ కొత్త ప్రతిపాదనలో నిజం లేదని మరికొందరు వాదిస్తున్నారు. యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌లోని ఈజిప్షియన్‌ ఆర్కియాలజీలో రిటైర్డ్‌ సీనియర్‌ లెక్చరర్‌ డాక్టర్‌ డేవిడ్‌ జెఫ్రీస్‌ మాట్లాడుతూ.. పురాతన ఈజిప్షియన్లు భారీ బ్లాక్‌లను తరలించేందుకు ర్యాంప్‌లు, హోలేజ్‌ పరికరాలను ఉపయోగించారనేది విస్తృతంగా ప్రచారంలో ఉందని చెప్పుకొచ్చారు.

నీటి శక్తితో పిరమిడ్ల నిర్మాణం..?

కాగా గతంలోనూ ఇలాంటి పలు ప్రతిపాదనలు వెలుగులోకి వచ్చాయి. పిరమిడ్ల నిర్మాణానికి అవసరమైన రాతి దిమ్మెలు, ఇతర సామాగ్రిని రవాణా చేయడానికి సమీపంలోని జల మార్గాన్ని ఉపయోగించుకున్నారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పురాతన నైలు నదీ పాయ పక్కనే పిరమిడ్లను నిర్మించి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు. అయితే కాలక్రమేణ ఆ నది పాయ ఎండిపోయి ఎడారిగా మారిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నది 4700 నుంచి 3700 సంవత్సరాల క్రితం నిర్మించిన పిరమిడ్‌లను ఆనుకుని ప్రవహించినట్లు భావిస్తున్నారు. పిరమిడ్స్‌ ఉన్న ప్రదేశంవైపే ఈ నది పాయ ఉన్న కారణంగానే పిరిమిడ్ నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని నది ద్వారా తరలించారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బరువైన బండరాళ్లను మోసేందుకు అప్పటి ఈజిప్షియన్లు మానవ శ్రమ కంటే, నీటి శక్తిని ఉపయోగించుకొని ఉండొచ్చని అప్పట్లో పరిశోధకులు పలు ప్రతిపాదనలు చేశారు.

పిరమిడ్ల వెనుక పలు నమ్మకాలు..

పిరమిడ్ల ఆకృతి గురించి పలు నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఈజిప్షియన్ల నమ్మకం ప్రకారం రాత్రి పూట ఆకాశంలో కనపడే దట్టమయిన నల్లని ప్రాంతం భూమికి, స్వర్గానికి మధ్య అడ్డుగోడలాంటిదట. పిరమిడ్ చివర సన్నని అంచు సరిగ్గా ఆ దట్టమయిన అడ్డుగోడకు సూచింపబడి ఉంటుంది. పిరమిడ్ మధ్యలో భద్రపరిచి ఉన్న గొప్ప వంశస్థుల మృతదేహం నుండి వారి ఆత్మ పిరమిడ్ ద్వారా ప్రయాణించి సన్నని మొన నుండి బయటకు వచ్చి ఆ అడ్డుగోడను ఛేదించి స్వర్గంలోకి ప్రవేశించి దేవతలను చేరుకుంటుందని వారి నమ్మకం. చనిపోయిన వారికి చిహ్నంగా భావించే సూర్యాస్తమయం జరిగే నైలు నదీ తీరాన అన్ని పిరమిడ్లు నిర్మించబడ్డాయి.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.

Egypt Pyramids

సూడాన్ దేశంలోనూ భారీగా పిరమిడ్లు

పిరమిడ్లు అనగానే అందరికీ ఈజిప్టు దేశమే గుర్తుకు వస్తుంది. కానీ సూడాన్‌లోనూ నుబియా ప్రాంతంలో ఈజిప్టుతో పోల్చితే రెట్టింపు సంఖ్యలో 255 పిరమిడ్లు ఉన్నాయి. ఈజిప్టుని పాలించిన నుబియన్ ఫారో చక్రవర్తులు సూడాన్ ప్రాంతానికి తరలివచ్చి అక్కడ రాజ్యాన్ని నెలకొల్పడంతో అక్కడి సంస్కృతి ఇక్కడికి విస్తరించిందని చరిత్రకారులు చెబుతారు.

గ్రహాంతర వాసులు నిర్మించారా..?

ఈజిప్ట్ పిరమిడ్స్‌పై అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ గతంలో చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పిరమిడ్లను గ్రహాంతర వాసులు నిర్మించారు అంటూ గతంలో ఆయన ట్వీట్ చేశారు. ఈ పిరిమిడ్స్ 3800 సంవత్సరాల నాటివని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఎలాన్ మస్క్ చేసిన ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియా వేదికలపై పెద్ద చర్చే జరిగింది. కాగా ఈ అంశంపై స్పందించి ఈజిప్టు మంత్రి రనియా అల్ మషత్.. తమ దేశానికి వచ్చి పిరమిడ్లను, నిర్మాతల సమాధులను చూడాలని కోరారు. అయితే హాస్యం కోసమే ఎలాన్ మస్క్ పిరమిడ్లను గ్రహాంతర వాసులు నిర్మించారని కామెంట్స్ చేసి ఉండొచ్చని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. హాస్యానికి కూడా పిరమిడ్లపై మస్క్ ఇలాంటి కామెంట్స్ చేయడం కాదని వారు తప్పుబట్టారు.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.

Egypt Pyramids

అత్యంత పురాతన పిరమిడ్‌పై కొత్త చర్చ

పిరిమిడ్లపై జరుగుతున్న పరిశోధనల్లో ఇటీవల మరో ఆసక్తికర అంశం వెల్లడయ్యింది. ఇండోనేషియాలో గునుంగ్ పడాంగ్ పిరమిడ్‌ను క్రీస్తుకు పూర్వం దాదాపు 25 వేల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు ఇటీవల పరిశోధకలు అంచనావేశారు. అసలు ఇది మానవ నిర్మిత పిరమిడేనా అన్న సందేహం కలుగుతోందని వారు సంచలన విషయాలు వెల్లడించారు. ఇప్పటి వరకు క్రీస్తుకు పూర్వం 2,630 సంవత్సర ప్రాంతంలో ఈజిప్టులో నిర్మించిన డీజోసెర్ పిరమిడ్ ప్రపంచంలో అత్యంత పురాతన పిరమిడ్‌గా గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సాధించింది. అయితే ఇండోనేషియాలోని పిరమిడ్ దాని కంటే ఎన్నో ఏళ్లు పురాతనమైనదిగా ఆ దేశంలోని ఇండోనేషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సస్‌కు చెందిన పరిశోధకలు వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీన్ని లావా పర్వతంతో సహజసిద్ధంగా ఏర్పడిన దాన్ని.. పరిమిడ్‌లా నిర్మించి ఉండొచ్చని వారు అంచనావేశారు.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.