Liquid Urea: ఇకపై యూరియా బస్తాల్లో మోసుకెళ్ళక్కర్లేదు.. లిక్విడ్ రూపంలో మార్కెట్ లోకి రాబోతున్న యూరియా!

Liquid Urea: పొలాల్లో పంటలు ఏపుగా పెరగాలంటే ఎరువులు వాడాలి. రైతులు ఎక్కువగా యూరియాను తమ పంట వేగంగా ఏపుగా పెరగడం కోసం వాడుతారు.

Liquid Urea: ఇకపై యూరియా బస్తాల్లో మోసుకెళ్ళక్కర్లేదు.. లిక్విడ్ రూపంలో మార్కెట్ లోకి రాబోతున్న యూరియా!
Liquid Urea

Updated on: Jun 05, 2021 | 5:28 PM

Liquid Urea: పొలాల్లో పంటలు ఏపుగా పెరగాలంటే ఎరువులు వాడాలి. రైతులు ఎక్కువగా యూరియాను తమ పంట వేగంగా ఏపుగా పెరగడం కోసం వాడుతారు. వరి పైరు పెరుగుదల కోసం నారు స్థాయి నుంచి పూత దశ వరకూ కనీసం నాలుగు సార్లు యూరియా పొలంలో చల్లుతారు. యూరియాలో 46 శాతం నత్రజని ఉంటుంది. నత్రజని మొక్కలను వేగంగా పెరిగేలా చేస్తుంది. అదే సమయంలో మొక్కలలో క్లోరోఫిల్ (ఆకుపచ్చని తనం)కూడా పెరుగుతుంది. సాధారణంగా యూరియా బస్తాల్లో దొరుకుతుంది. సంప్రదాయ వ్యవసాయంలో యూరియా బస్తాలతో తీసుకెళ్ళి.. పొలం అంతా చల్లే విధానమే అమలులో ఉంది. కొన్ని ఉద్యాన పంటల్లో యూరియాను ద్రవ రూపంలో మొక్కలకు ఇస్తారు. అంటే యూరియాను నీటిలో కలిపి దానిని మొక్కలపై పిచికారీ చేస్తారు. దీని ద్వారా నత్రజని వేగంగా మొక్కలకు అందుతుందని చెబుతారు.

ఇప్పటివరకూ ఎక్కువగా వ్యవసాయంలో యూరియాను ఘనరూపంలోనే పొలాల్లో చల్లడం ద్వారానే వాడుతూ వస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆ విధానం మారబోతోందని చెబుతున్నారు. యూరియాను ఘన రూపంలో కాకుండా ద్రవ రూపంలో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయని చెబుతున్నారు. ఇప్పటివరకూ 45 కిలోల బస్తా రూపంలో అందుబాటులో ఉన్న యూరియా ఇప్పుడు 500 మిల్లీ లీటర్ల ద్రవ రూపంలో అందుబాటులోకి రానుంది. ద్రవ రూప యూరియాను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫెర్టిలైజర్‌ కో ఆపరేటివ్‌ లిమిటెడ్‌ (ఇఫ్కో) ఇప్పుడు ద్రవరూప యూరియాను మార్కెట్ లోకి తీసుకురావడానికి సిద్ధం అవుతోంది. జూన్ లోనే అంటే ఈ నెలలోనే ద్రవ రూప యూరియా ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్టు ఇఫ్కో వెల్లడించింది. త్వరలోనే ఇది మార్కెట్ లో అందుబాటులోకి వస్తుంది. ఘనరూప యూరియా బస్తా 45 కిలోలకు 266 రూపాయలు ధర ఉంది. కాగా, అదే మొత్తం ప్రయోజనాన్ని ఇచ్చే ద్రవ రూప యూరియాపై కూడా దాదాపుగా అంతే ధర ఉంటుంది. కాకపోతే ఒక పదిరూపాయలు తక్కువ ఉండొచ్చని చెబుతున్నారు.

భూసార పరీక్షలు లేకుండా యూరియాను విచ్చల విడిగా రైతులు వాడుతున్నారు. దీంతో యూరియాపై ప్రతి ఏటా దాదాపు 47,805 కోట్ల రూపాయలను సబ్సిడీగా కేంద్రం భరిస్తోంది. ఇప్పుడు ద్రవరూప యూరియాను మొక్కలపై నేరుగా పిచికారీ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల భూసారం దెబ్బతినే అవకాశం చాలావరకూ తగ్గుతుంది. ఎందుకంటే నేరుగా మొక్కలపై చల్లిన యూరియా ద్రావణంలోని నత్రజని ఆకుల ద్వారా మొక్కకు నేరుగా అందుతుంది. అది భూమిలోకి వెళ్ళే శాతం తగ్గిపోతుంది. అంతేకాకుండా, యూరియాను పొలంలో చల్లడం వల్ల చాలా వృధా పోతుంది. అందులోని నత్రజని పూర్తిగా భూమిలోంచి మొక్కకు అందడం కష్టం. కొంత గాలిలో ఆవిరిరూపంలో పోతుంది. ద్రవరూపంలో ఇచ్చే యూరియా వల్ల దాదాపు 50 శాతం వృధాను అరికట్టవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. నానో(ద్రవ రూప) యూరియాతో కాలుష్యం కూడా తగ్గుతుందని అంచనా. 94 పంటలపై ద్రవరూప యూరియాను ప్రయోగించి మంచి ఫలితాలు సాధించినట్లు ఇఫ్కో చెబుతోంది.

మొత్తమ్మీద ద్రవరూప యూరియా అందుబాటులోకి వస్తే రైతులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బస్తాలుగా యూరియా పొలాలకు తీసుకువెళ్ళడానికి పడే బాధలు తప్పుతాయి. భూమి కూడా తన సారాన్ని కోల్పోదు. సంప్రదాయ విధానాలకు ఆలవాటు పడి వ్యవసాయం చేసే మన రైతులు ఈ ద్రవరూప యూరియాను ఎంతవరకూ అలవాటు చేసుకోగలరనేది వేచి చూడాల్సి ఉంటుంది.

Also Read: Strange Incident: ఇదేం వింత గురూ.. రావి చెట్టుకు మామిడికాయలు.. నివ్వెర‌పోతున్న స్థానికులు

Venkaiah Naidu : ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకమని వెంకయ్య నాయుడు పిలుపు

 

Loading...
Unable to load recommendations.
Follow Us