
Silent heart risks: గత కొంత కాలంగా చిన్నా పెద్దా లేకుండా గుండెపోటు బారినపడుతున్నారు. గతంలో 50 ఏళ్లపైబడిన వారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. అయితే, ఇటీవల మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయస్సులోనే ఈ ప్రాణాంతక వ్యాధిన పడుతున్నారు. 20-30 ఏళ్ల వయస్సు వారు కూడా గుండెపోటు బారినపడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఈ ప్రాణాంతక వ్యాధి బారినపడుతుండటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా, నాగ్పూర్కు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ పఖ్మోడే.. గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో వైద్య రంగంలో మలుపు తిరిగింది. ప్రతిరోజూ 8–9 శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ వంద మందికి పైగా రోగులను చూసేవారు, అయినప్పటికీ ఆయనకు ఎటువంటి రక్తపోటు లేదా మధుమేహ సమస్యలు లేవు. అయినప్పటికీ, ఆయనకు ‘వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్’ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గుండెపోటుతో మరణించడం ఇప్పుడు వైద్య నిపుణులను మరింతగా ఆలోచనలో పడేసింది.
డాక్టర్ పఖ్మోడే మరణానికి మూడు రోజుల ముందు, శస్త్రచికిత్స సమయంలో ఛాతీ నొప్పితో బాధపడ్డారు. అయితే ECG సాధారణంగా రావడంతో ఆయన ఆ సమస్యను విస్మరించారు. గుండె నిపుణుల ప్రకారం.. సాధారణ ECG ఉంటే.. గుండె పూర్తిగా సురక్షితం అని అర్థం కాదు. అధిక పని ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం వంటి పరిస్థితులు రక్తనాళాల్లో ఆకస్మిక సమస్యలకు కారణమవుతాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ECGలో కొన్ని ముందస్తు మార్పులు గుర్తించబడకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో, ‘ట్రోపోనిన్’ వంటి రక్త పరీక్షలు గుండె కండరానికి చిన్న నష్టాలను కూడా గుర్తించగలవు. కేవలం ఒక పరీక్షపై ఆధారపడకుండా, లక్షణాలు కొనసాగితే మరిన్ని పరిశీలనలు చేయడం అవసరం.
డాక్టర్ పఖ్మోడే మరణానికి ముందు వరకు కూడా.. రాత్రి 2:30 వరకు అత్యవసర కేసులతో బిజీగా ఉన్నారు. తగినంత విశ్రాంతి లేకపోవడం, నిరంతర పని ఒత్తిడి గుండెపై భారం పెంచాయి. శరీరంపై అధిక భారం ఉంటే, గుండె ధమనులలో అకస్మాత్తుగా ‘స్పాస్మ్’ లేదా ‘బ్లాకేజ్’ సంభవించవచ్చు.
SCAD వంటి అరుదైన పరిస్థితులు గుండెపోటుకు రోజులు లేదా వారాల ముందే సంకేతాలను ఇస్తాయి. ఛాతీలో అసౌకర్యం, ఊపిరితీసుకోలేకపోవడం, ఊహించని అలసట, వెన్నునొప్పి వంటి లక్షణాలను మనం గ్యాస్ లేదా అలసటతో తక్కువగా పరిగణిస్తాము. డాక్టర్ పఖ్మోడే కూడా తన ఛాతీలో అసౌకర్యాన్ని పని అలసటగా పరిగణించారు.
ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించేవారికి డాక్టర్ పఖ్మోడే మరణం ఒక స్పష్టమైన హెచ్చరిక. ఎంత పెద్ద విజయాలు, సంపద ఉన్నా.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కాస్త చిన్న సంకేతాలు కూడా ప్రాణాల్ని తీయవచ్చు. వైద్యులు రోగులకు విశ్రాంతి తీసుకోవాలని చెబుతారు, కానీ తమ స్వంత ఆరోగ్యాన్ని విస్మరించడం ప్రాణహానికరం కావచ్చు. సామాన్యులకూ ఇదే వర్తిస్తుంది. కష్టపడి పనిచేయడం మంచిది, కానీ శరీర సంకేతాలను గమనించడం, తగినంత నిద్ర తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించడం అత్యంత అవసరంగా గుర్తించాలి.