Weight Loss: పండుగ సమయంలో నోరూరించే ఫుడ్స్‌.. బరువు పెరగొద్దంటే ఈ టిప్స్‌ పాటించండి..

|

Sep 24, 2022 | 12:26 PM

Weight Loss: దసర, దీపావళి పండుగలు సమీపిస్తున్నాయి. సహాజంగానే పండుగ అంటే అందిరికీ ముందుగా గుర్తొచ్చేది ఫుడ్‌. పిండి వంటలు, స్వీట్లు, నాన్‌ వెజ్‌లు ఇలా రకరకాల రుచులు నోరూరిస్తుంటాయి. బరువు పెరగకుండా జాగ్రత్తలు..

Weight Loss: పండుగ సమయంలో నోరూరించే ఫుడ్స్‌.. బరువు పెరగొద్దంటే ఈ టిప్స్‌ పాటించండి..
Lifestyle
Follow us on

Weight Loss: దసర, దీపావళి పండుగలు సమీపిస్తున్నాయి. సహాజంగానే పండుగ అంటే అందిరికీ ముందుగా గుర్తొచ్చేది ఫుడ్‌. పిండి వంటలు, స్వీట్లు, నాన్‌ వెజ్‌లు ఇలా రకరకాల రుచులు నోరూరిస్తుంటాయి. బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకునే వారు కూడా పండగ సమయంలో వెనకాముందు ఆలోచించకుండా లాగించేస్తుంటారు. దీంతో సహజంగానే బరువు పెరుగుతారు. ఎన్నో రోజుల నుంచి కష్టపడి తగ్గిస్తూ వస్తున్న బరువు మళ్లీ ఒక్కసారి పెరిగిపోతుంది. అయితే పండగ ఆనందాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు నచ్చిన ఫుడ్‌ను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని సింపుల్ టిప్స్‌ ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. ఇంతకీ నిపుణులు చెబుతోన్న ఆ టిప్స్‌ ఏంటంటే..

పండుగల వేళ నచ్చిన ఆహారం తీసుకుంటూనే బరువును కంట్రోల్‌ ఉంచుకోవచ్చని ఫోర్టిస్‌ హాస్పిటల్‌కు చెందిన డైటీషియన్‌ డాక్టర్‌ టీనా సప్రా టీవీ9తో ప్రత్యేకంగా తెలిపారు. ఇందుకోసం ఆహారాన్ని తీసుకునే విధానంలో మార్పులు చేయాలి. ఒకవేళ రాత్రి డిన్నర్‌ ఎక్కువగా చేసే అవకాశం ఉంటే మధ్యాహ్నం లంచ్‌ తగ్గించాలి. ఈ విధంగా క్యాలరీలను బ్యాలెన్స్‌ చేసుకుంటే ఫలితం ఉంటుందని డాక్టర్‌ సప్రా వివరించారు. గ్రీన్‌ జ్యూస్‌ లేదా తేలికపాటి భోజనం, సలాడ్‌ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను సెలక్ట్‌ చేసుకోవచ్చని తెలిపారు. భోజనంలో ఎక్కువగా పచ్చి కూరగాయలు, దోసకాయ, పుచ్చకాయ ఓట్స్‌ వంటి వాటినే ఉండేలా చేర్చుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనం కోసం పిండి వంటకాల కంటే ప్రోటీన్‌లు ఉండే కూరగాయలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇక ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారు పూర్తిగా ఆహారానికి దూరంగా ఉండడం కూడా మంచిది కాదని డాక్టర్‌ టీనా సప్రా సూచిస్తున్నారు. ఇలాంటి వారు బంగళాదుంపలు, అన్నం, చిలగడదుంపలు వంటి ఆహారాలను పరిమితం చేయాలని చెబుతున్నారు. ఆకుకూరలు తినడం వల్ల ప్రేగులకు మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. అన్ని రకాల పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని కానీ, అరటి పండుకు దూరంగా ఉండడం మంచిదని తెలిపారు. అలాగే భోజనానికి ముందు ఒకటి నుంచి రెండు గ్లాసు నీరు తాగాలని, చాక్లెట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. అలాగే వేయించిన ఆహార పదార్థాలకు బదులుగా ఆవిరితో ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

డాక్టర్‌ టీనా సప్రా మాట్లాడుతూ.. స్వీట్స్‌ తయారీలో మావా ఉపయోగానికి బదులుగా పన్నీరును వాడాలని చెబుతున్నారు. అలాగే నెయ్యి వాడకాన్ని తగ్గించాలని, ఆల్కహాల్‌, కూల్‌డ్రింక్స్‌కు పండగ సమయంలో దూరంగా ఉండాలని తెలిపారు. కొలస్ట్రాల్‌ సమస్యలు ఉన్నవారు బిస్కెట్లు, బ్రెడ్‌, కేకులకు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు.

ఇక ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివాకర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పండుగ సమయంలో బరువు తగ్గేందుకుగాను కొన్ని చిట్కాలను పంచుకున్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. సమయానికి నిద్ర పోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఆహార ఎంపికలో ఒక స్థిరత్వాన్ని పాటించాలి, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి అని పేర్కొన్నారు. ఇక పండుగ కదా అని వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఆమె వివరించారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..