ఈ ఆకు మీకు తెలుసా..? కూర వండి తింటే కొండల్ని కూడా పిండి చేసే బలం..

కొండపిండి ఆకు, దీనిని కిడ్నీలో రాళ్లు కరిగించడానికి ఉపయోగించే సంప్రదాయ ఔషధంగా గిరిజనులు తరతరాలుగా నమ్ముతున్నారు. కొండపిండి ఆకు కూర వండుకునే విధానం, దాని ఆరోగ్య ప్రయోజనాలను ఈ కథనంలో తెలుసుకుందాం. మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడమే కాకుండా, స్త్రీలలో గర్భసంచి సమస్యలకూ ఇది మేలు చేస్తుందట.

ఈ ఆకు మీకు తెలుసా..? కూర వండి తింటే కొండల్ని కూడా పిండి చేసే బలం..
Konda Pindi Aaku

Updated on: Feb 12, 2026 | 7:45 AM

కొండపిండి ఆకు, గిరిజన ప్రాంతాలలో విరివిగా లభించే ఒక వనమూలిక. ఇది మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి ఒక శక్తివంతమైన సంప్రదాయ ఔషధంగా తరతరాలుగా ఉపయోస్తున్నారు. ఆధునిక జీవనశైలిలో 30 సంవత్సరాలు దాటిన చాలా మందిని వేధిస్తున్న కిడ్నీలో రాళ్ల సమస్యకు ఇది ఒక అద్భుతమైన పరిష్కారం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.  గిరిజన ప్రజలు అడవిలో దొరికే వనమూలికలను ఉపయోగిస్తున్నారట. కొండపిండి ఆకును గుర్తించడం చాలా సులభం. దీని ఆకులు బూడిద రంగులో ఉండి, అక్కడక్కడ పువ్వుల మాదిరిగా కనిపిస్తాయి. ఈ ఆకును ఏజెన్సీ ప్రాంతాల్లో లేదా గ్రామాల సమీపంలో కూడా గుర్తించవచ్చు. ఆకులను సేకరించిన తర్వాత, వాటిని జాగ్రత్తగా శుభ్రం చేసి, లేత ఆకులు, చిగుళ్లు, పూతలను మాత్రమే ఏరుకోవాలి. ఈ ప్రక్రియలో చెత్తను తొలగించడం చాలా ముఖ్యం.

కొండపిండి ఆకు కూర వండే విధానం:

మొదటగా, ఆకులను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

కావలసిన పదార్థాలు:

ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర. ముందుగా పొయ్యి మీద మట్టిపాత్రను పెట్టి వేడి చేయాలి. పాత్ర వేడెక్కిన తర్వాత నూనె వేసి, నూనె మరిగిన తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసి కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లి, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత తరిగిన కొండపిండి ఆకును వేసి బాగా కలపాలి. ఆకు బాగా ఉడకడానికి సరిపడా ఉప్పు (గడ్డ ఉప్పు దంచి మెత్తగా చేసి వేయడం మంచిది) వేసుకోవాలి. కూర అడుగు పడుతున్నప్పుడు కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి ఉడికించుకోవాలి. కూర ఉడికిన తర్వాత దించుకోవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు:

కొండపిండి ఆకు కూర రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇది ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, రాళ్లను కరిగించే శక్తి ఈ ఆకుకు ఉంటుందట. అందుకే దీనిని కొండలను కూడా పిండి చేసే సత్తా ఉన్న ఆకు అని కూడా అంటారు. పురుషులలో కిడ్నీలో రాళ్లను కరిగించడంలో సహాయపడటమే కాకుండా, స్త్రీలలో గర్భసంచి సమస్యలను కూడా ఇది తొలగిస్తుందట. ఈ సంప్రదాయ పద్ధతిని పాటించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచించారు.

(ఈ కథనంలో సమాచారం ఆయుర్వేద నిపుణులు నుంచి సేకరించాం. మీరు దీన్ని తినే ముందు డైటీషియన్లు, వైద్యుల్ని సంప్రదించడం మంచిది)