మిడతల దాడిని నియంత్రించడానికి.. ప్రభుత్వ సూచనలు..
ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్డౌన్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. మరోవైపు దేశంపై మిడతల దండయాత్ర కొనసాగుతోంది.
ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్డౌన్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. మరోవైపు దేశంపై మిడతల దండయాత్ర కొనసాగుతోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రను దాటి తెలుగు రాష్ట్రాలవైపు దూసుకువస్తున్నాయి. దీంతో తీవ్ర ఆందోళన మొదలైంది. మిడతల దండు మహారాష్ట్రలోని అమరావతి వరకూ చేరుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
దేశ రాజధాని ఢిల్లీలో మిడతల దాడిని నియంత్రించడానికి నివారణ చర్యలపై ఢిల్లీ ప్రభుత్వం పలు సూచనలు జారీ చేసింది. యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఈ సూచనలు వర్తిస్తాయి. రాత్రి పూట పంట పొలాలు, గార్డెన్స్, కూరగాయల పంటలకు పిచికారీ చేసుకోవాల్సిన మందులను రైతులకు సూచించింది. మిడతలు రాత్రి పూట ప్రయాణించవు కాబట్టి మెలిథియోన్, క్లోరిఫైరీపాస్ ద్రావణాల మిశ్రమాలను సూచించిన మోతాదు మేరకు పిచికారీ చేసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది.
కాగా.. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. అమరావతిలో అదుపు కాని పక్షంలో.. త్వరలోనే రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించే ప్రమాదముందని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం కావాలని సూచించారు. సస్యరక్షణ రసాయన మందులను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆయన స్పష్టం చేశారు.