
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక కొత్త మంత్రం వినిపిస్తోంది. ఒకప్పుడు సినిమా హిట్ అయితే వేరే కథతో ముందుకు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక్కసారి వెండితెరపై బొమ్మ హిట్ కొట్టిందా.. ఇక దానికి కొనసాగింపుగా పార్ట్-2, పార్ట్-3 అంటూ సీక్వెల్స్ ప్రకటించేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎటు చూసినా సీక్వెల్స్ నామస్మరణే వినిపిస్తోంది. ముఖ్యంగా మన అగ్ర హీరోలందరూ ఇప్పుడు తమ పాత రికార్డులను తిరగరాయడానికి సెకండ్ పార్ట్ లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ లో ఏకంగా 41 సినిమాలు సీక్వెల్స్ రేసులో ఉన్నాయట. ఈ లిస్టు చూస్తుంటే రాబోయే రెండు మూడేళ్ల వరకు బాక్సాఫీస్ వద్ద సీక్వెల్స్ సునామీ ఖాయమనిపిస్తోంది. మరి ఆ 41 సినిమాల లిస్టులో ఉన్న క్రేజీ ప్రాజెక్టులు ఏంటి?
ముందుగా భారీ బడ్జెట్ సినిమాల విషయానికి వస్తే.. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ టాప్ లో ఉన్నారు. ఆయన నటించిన ‘సలార్ 1’ సృష్టించిన విధ్వంసం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘సలార్ 2: శౌర్యాంగ పర్వం’ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’కి కూడా పార్ట్-2 సిద్ధమవుతోంది. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ కోసం దేశమంతా వెయిట్ చేస్తుంటే.. అప్పుడే ‘పుష్ప 3’ గురించి కూడా వార్తలు మొదలయ్యాయి. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ కు సీక్వెల్ గా ‘యానిమల్ పార్క్’ 2028లో రాబోతోందని స్వయంగా మేకర్స్ ప్రకటించారు. వీటితో పాటు ‘కేజీఎఫ్ 3’, ‘విక్రమ్ 2’, ‘ఖైదీ 2’, ‘జైలర్ 2’ వంటి సినిమాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.
Karthikeya 2 & Virupaksha
కేవలం భారీ యాక్షన్ సినిమాలు మాత్రమే కాదు.. చిన్న సినిమాలు, మిస్టరీ థ్రిల్లర్స్ కూడా సీక్వెల్స్ బాట పట్టాయి. నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘కార్తికేయ 3’, సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష 2’, అజయ్ భూపతి ‘మంగళవారం 2’ సినిమాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అలాగే తేజ సజ్జా ‘జై హనుమాన్’, నాని ‘హిట్ 4’, అడవి శేష్ ‘గూఢచారి 2’ వంటి సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార 2’ తో మళ్ళీ సోషియో ఫాంటసీ మ్యాజిక్ చేయబోతున్నారు. కిరణ్ అబ్బవరం ‘కేఏ 2’ గురించి కూడా టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఇలా యాక్షన్, థ్రిల్లర్, హారర్ జోనర్లలో సుమారు 41 సినిమాలు ఇప్పుడు సీక్వెల్స్ లిస్టులో చేరడం టాలీవుడ్ చరిత్రలో ఇదే మొదటిసారి.
G2 & Jai Hanuman
ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ కూడా సేఫ్ జోన్ లో ఉండాలని భావిస్తున్నారు. కొత్త కథతో ప్రయోగాలు చేసే కంటే.. ఇప్పటికే ప్రేక్షకులు ఆదరించిన పాత్రలను మళ్ళీ వెండితెరపై చూపిస్తే మినిమం గ్యారంటీ వసూళ్లు వస్తాయని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలు మంచి ఫలితాలను అందుకోవడంతో.. ఇక మార్చి నుంచి రాబోతున్న పెద్ద సినిమాలపై అందరి దృష్టి ఉంది. ఒకప్పుడు సీక్వెల్స్ అంటే కేవలం హాలీవుడ్ లోనే అనుకునేవారు, కానీ ఇప్పుడు టాలీవుడ్ సినిమాలే ప్రపంచవ్యాప్తంగా సీక్వెల్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. వరుసగా వస్తున్న ఈ 41 సీక్వెల్స్ లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందో, ఏది ప్రేక్షకులను నిరాశపరుస్తుందో వేచి చూడాలి. ఏదేమైనా తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు సీక్వెల్స్ తో పాన్ వరల్డ్ రేంజ్ కు చేరుకుంది.