
తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మీనా. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విక్టరీ వెంకటేష్తో తన కెరీర్ ప్రయాణం, చంటి సినిమాలోని మరచిపోలేని జ్ఞాపకాలు, అలాగే దృశ్యం 2 సీక్వెల్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వెంకటేష్తో కలిసి చేసిన ప్రతీ సినిమా విజయవంతమైందని, వారి కాంబినేషన్ ఎల్లప్పుడూ ప్రేక్షకుల మన్ననలు పొందిందని తెలిపారు మీనా. వెంకటేష్ తన అభిమాన వ్యక్తులలో, నటులలో ఒకరని మీనా తెలిపారు. చంటి సినిమా సమయంలో వెంకటేష్ అప్పటికే ఒక సూపర్ స్టార్ కాగా, తాను అప్పుడే పరిశ్రమకు వచ్చిన కొత్త నటిని అని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో తాను చాలా ఇంట్రావర్ట్ అని, మాట్లాడటానికి భయపడేదాన్నని, పెద్ద నటులు, దర్శకులు ఉన్నారనే భయంతో తన అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సందేహించేదాన్నని చెప్పారు.
కాలక్రమేణా, అనేక సినిమాలు చేసిన తర్వాత, వెంకటేష్తో ఆమెకు ఒక సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడిందని, అది ఇప్పుడు ఒక బలమైన స్నేహంగా మారిందని వివరించారు. ఈ ప్రయాణం వెంకటేష్ తన ఎదుగుదలను, టీనేజ్ నుంచి పెళ్లి, తల్లిగా మారడం వంటి ప్రతి దశను చూశారని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి అనుబంధం ఉన్న వ్యక్తితో, స్నేహితుడితో పనిచేయడం వల్ల పని వాతావరణం మరింత ఆనందంగా, హ్యాపీగా ఉంటుందని మీనా అన్నారు. “దృశ్యం 1”, “దృశ్యం 2” వంటి సినిమాలలో వెంకటేష్తో మళ్లీ పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చిందని ఆమె తెలిపారు.
“చంటి” సినిమాలోని ఒక భావోద్వేగ సన్నివేశం “పావురానికి పంజరానికి” పాట తర్వాత, వెంకటేష్ను కౌగిలించుకునే క్లైమాక్స్ సన్నివేశం గురించి మీనా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సన్నివేశం సినిమాలో చాలా కీలకమైందని, దానిని సమర్థవంతంగా చేయాలని తీవ్ర ఒత్తిడికి గురయ్యానని చెప్పారు. దాంతో వెంకీని గట్టిగా కౌగిలించుకున్నా.. ఆ సమయంలో తాను చాలా భయపడ్డానని, నెర్వస్గా ఉన్నానని, ప్రేక్షకులకు అది కరెక్ట్ గా వెళ్లాలని కోరుకున్నా అని తెలిపారు. ఆ సీన్ చేస్తున్నప్పుడు తాను మరీ ఓవర్గా నటించానా, ఆయన ఏమనుకుంటారు అని ఆందోళన చెందానన్నారు. అయితే, నటిగా తన ప్రయాణంలో అది ఒక పాఠం నేర్పిందని, ఒక పాత్రకు అవసరమైనంత ఉద్రేకంగా లేదా వైల్డ్గా నటించడం తప్పుకాదని తర్వాత అర్థమైందని మీనా వివరించారు. బాగా నటించాలనే ఆలోచన మాత్రమే ఉండాలి తప్ప, ఇతరులు ఏమనుకుంటారోనని భయపడకూడదని అప్పుడు గ్రహించానన్నారు.