
ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, మట్టి వాసన వెదజల్లే పాత్రలతో మెప్పిస్తున్న మన తెలుగు నటులు నేడు జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్నారు. తనదైన సహజ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటుడు రాగ్ మయూర్ ముంబై వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ‘నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్’ (NEXA Streaming Academy Awards) వేడుకలో ఉత్తమ నటుడిగా (బెస్ట్ యాక్టర్) అవార్డును సొంతం చేసుకున్నారు. అమెజాన్ ఒరిజినల్ అయిన ‘సివరపల్లి’ వెబ్ సిరీస్లో ఆయన పోషించిన పాత్రకు ఈ గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా సినీరంగంలో ఉన్న ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో రాగ్ మయూర్ సందడి చేశారు. బాలీవుడ్ దిగ్గజ నటులు మనోజ్ బాజ్పేయి, బోమన్ ఇరానీ వంటి ఉద్ధండులతో పాటు, ప్రఖ్యాత దర్శక ద్వయం రాజ్ & డీకే వంటి ప్రముఖులతో కలిసి ఆయన ఒకే వేదికను పంచుకోవడం విశేషం.
తెలుగు ప్రాంతీయ కథలు, ఇక్కడి పాత్రలు నేడు జాతీయ స్థాయిలో ఏ విధంగా ఆదరణ పొందుతున్నాయో చెప్పడానికి ఈ ఘనతే నిదర్శనం. కంటెంట్ ఏదైనా, అది ప్రజలకు చేరే విధానంలో భాషా బేధాలు అనేవి పెద్దగా ప్రభావం చూపడం లేదు. కేవలం హావభావాలు, పాత్రలో జీవించే తత్వమే ఒక నటుడిని ఉన్నత స్థానంలో నిలబెడతాయి అనడానికి రాగ్ మయూర్ విజయమే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రాంతీయ పరిధులను దాటి, తన అంకితభావంతో అద్భుతమైన నటనను ప్రదర్శించిన రాగ్ మయూర్ విజయం… రాబోయే తరానికి చెందిన ఎంతో మంది యువ నటులకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
2021లో ‘సినిమా బండి’లో మరిడేష్ బాబు పాత్రతో తెలుగు ఆడియెన్స్ ను తెగ నవ్వించాడు రాగ్ మయూర్. ఆ తర్వాత వీరాంజనేయులు విహారయాత్ర, కీడా కోలా, మిత్రమండలి, పరదా, గాంధీతాత, శుభం సినిమాల్లో హీరోగా, కమెడియన్ గా, విలన్ గా మెప్పించాడీ ట్యాలెంటెడ్ హీరో. అలాగే ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’, ‘సివరపల్లి’ వెబ్ సిరీస్ల్లోనూ కీలక పాత్రలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘సివరపల్లి’ వెబ్ సిరీస్ లో ఆయన నటనకు గాను నేషనల్ లెవల్ వేదికపై అవార్డు దక్కింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి