14 టేక్‌లు చేయించాడు.. ఆ దర్శకుడి మీద సీరియస్ అయ్యా..! స్టార్ డైరెక్టర్ గురించి ప్రకాష్ రాజ్ కామెంట్స్

సినీప్రియులకు నటుడు ప్రకాష్ రాజ్ సుపరిచితమే. హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఆయన .. ఆ తర్వాత విలన్ పాత్రలతో అదరగొట్టారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగానూ రాణిస్తున్నారు. బెంగళూరులో పుట్టి పెరిగిన ఆయన.. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నారు.

14 టేక్‌లు చేయించాడు.. ఆ దర్శకుడి మీద సీరియస్ అయ్యా..! స్టార్ డైరెక్టర్ గురించి ప్రకాష్ రాజ్ కామెంట్స్
Prakash Raj

Updated on: Dec 30, 2025 | 2:06 PM

సినిమా ఇండస్ట్రీలో వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకొని రాణిస్తున్న నటుడు ప్రకాష్ రాజ్. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటిస్తూ దూసుకుపోతున్నారు. కాగా ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, విజయాల వెనుక ఉన్న కృషి, సవాళ్లతో పాటు సంఘటనల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలచందర్ వంటి గొప్ప దర్శకుడితో తన సినీ ప్రయాణం ప్రారంభమైందని, ఆ తర్వాత మణిరత్నం వంటి దర్శకులు తన ప్రతిభను గుర్తించారని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలో తన అదృష్టం ఎలా కలిసి వచ్చిందో ఆయన వివరించారు. రఘువరన్ వంటి నటుడు ఒక దశలో అందరికీ అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడినప్పుడు, పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ, గుణశేఖర్, వి.వి. వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులు ఆకలితో మంచి నటుల కోసం చూస్తున్నారని, అలాంటి సమయంలో వారికి తాను దొరకడం కలిసి వచ్చిందని ప్రకాష్ రాజ్ అన్నారు.

కృష్ణవంశీతో అంతఃపురం, ఖడ్గం, సముద్రం వంటి చిత్రాలు, త్రివిక్రమ్ రచనలు, అలాగే విజయభాస్కర్ రెడ్డి దర్శకత్వంలో కృష్ణా రెడ్డి నిర్మించిన గన్ షాట్, వినోదం వంటి చిత్రాలు తన కెరీర్‌ను టర్న్ చేశాయని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రతిభతో పాటు అదృష్టం, సరైన సమయం తనకు కలిసొచ్చాయని ప్రకాష్ రాజ్ తెలిపారు. తన సినీ జీవిత ప్రారంభంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలను ప్రకాష్ రాజ్ గుర్తు చేసుకున్నారు. కర్ణాటకలో చిన్న చిన్న వేషాలు వేస్తూ, 1994లో డ్యూయెట్ చిత్రంతో తమిళంలో అడుగుపెట్టారు ప్రకాష్ రాజ్. ఆ ఏడాదే తన తొలి వివాహం కూడా జరిగిందని తెలిపారు. నటుడిగా తన పాత్రలకు ఎలా సిద్ధపడతారో ప్రకాష్ రాజ్ వివరించారు.

అంతఃపురంలో వృద్ధుడి పాత్రకు పెద్ద అడుగులు వేస్తూ నడవమని కృష్ణవంశీ చెప్పిన విధానాన్ని గుర్తుచేసుకున్నారు. రాయలసీమ ప్రాంతంలో ప్రజలు పెద్ద అడుగులు సహజంగా వేస్తారని, అది పాత్రకు మరింత సహజత్వం ఇస్తుందని కృష్ణవంశీ తనకు చెప్పినట్లు తెలిపారు. అంతఃపురంలోని నరసింహ పాత్రలో ఢిల్లీ రాజేశ్వరి పాత్ర గాజులు తీసేటప్పుడు ఏడవాల్సిన సన్నివేశంలో 14 టేక్‌లు తీసుకున్నప్పుడు తనకు కోపం వచ్చిందని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఏం కావాలిరా నీకు?  అని తాను సీరియస్ అయ్యాను అని గుర్తు చేసుకున్నారు. అప్పుడు కృష్ణవంశీ లైట్స్ ఆఫ్ చేయించి, ఎంత క్రూరంగా ఉన్నా పాత్ర, తన కూతురి వితంతువవుతున్నప్పుడు ఒక తండ్రికి వచ్చే అసహాయతను, ఏడు సంవత్సరాల చిన్న పిల్లాడి ఏడుపు లాంటి భావాన్ని చూపించమని కృష్ణవంశీ కోరాడని ప్రకాష్ రాజ్ అన్నారు. దర్శకుడు ఇచ్చే అటువంటి చిన్న చిన్న ఇన్‌పుట్స్ తన నటనకు, జాతీయ అవార్డులు సాధించడానికి ఎంతగానో దోహదపడ్డాయని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.