
డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు అనే డైలాగ్ గుర్తుకువస్తారు ఆయన.. తన బిజినస్ కు తానే బ్రాండ్ అంబాసిడర్.. ఎన్నో రకాల యాడ్స్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు.. ఆయనే లలితా జ్యువెలర్స్ అధినేత డా. ఎం. కిరణ్ కుమార్. లలిత జ్యులరీ యాడ్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు కిరణ్ కుమార్. ఈయన యాడ్స్ లో తోప్ అనే చెప్పాలి. కొత్త కొత్త ఐడియాలతో యాడ్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు కిరణ్ కుమార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిరణ్ కుమార్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిన్నతనంలో తన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందని కిరణ్ కుమార్ పంచుకున్నారు. ఏమీ లేని స్థాయి నుంచి ఇప్పుడు లలితా జ్యువెలర్స్ అధినేతగా ఎదిగారు కిరణ్.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి చెప్పులు వేసుకోలేదని.. ఆయన చనిపోయేంతవరకూ కూడా తన తండ్రి చెప్పులు వేసుకోలేదని తెలిపారు. ఇంట్లో భోజనానికి కూడా డబ్బులు లేని రోజులు చాలా ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. 8 సంవత్సరాల వయసులోనే డబ్బు విలువ, ఆకలి కష్టాలను చూశాను అని ఆయన అన్నారు. తల్లిదండ్రులు తిండి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు విన్న మాటలు ఆయనను ఎంతగానో ప్రభావితం చేశాయని తెలిపారు. అటువంటి పరిస్థితుల మధ్య 14 ఏళ్లకే వ్యాపారంలోకి అడుగుపెట్టా అని తెలిపారు కిరణ్ కుమార్.
అలాగే ఆయన మాట్లాడుతూ.. తన వ్యాపారాన్ని 65 గ్రాముల బంగారంతో ప్రారంభించా అని తెలిపారు. తన తల్లి గాజులను కుదవ పెట్టకుండా, వాటిని కరిగించి ఆ బంగారంతోనే హోల్సేల్ వ్యాపారం మొదలుపెట్టా అని తెలిపారు. కేవలం 19 ఏళ్ల వయసుకే ఆయన కోటీశ్వరుడు అయ్యారు. తన చిన్న వయసులోనే ఈ స్థితికి చేరుకోవడానికి కారణం, తన బాల్యంలో ఎదుర్కొన్న కష్టాలే అని ఆయన స్పష్టం చేశారు. కిరణ్ కుమార్ డబ్బును, ఆకలిని తన గురువులుగా భావిస్తా అన్నారు. డబ్బు లేనప్పుడే దాని విలువ తెలుస్తుందని, ఆకలితో ఉన్నప్పుడే ఆహారం విలువ అర్థమవుతుందని ఆయన చెప్పారు. డబ్బు ఉన్నవాళ్లు దాన్ని తేలికగా తీసుకుంటారని, కానీ డబ్బును గౌరవించని వాళ్లు చాలా కష్టపడతారని అన్నారు. సమాజంలో కూడా డబ్బును చూసే మనుషులను గౌరవిస్తారని, ఇది నేటి వాస్తవ పరిస్థితి అని ఆయన అన్నారు. ప్రతిరోజు కేవలం 4-5 గంటలు మాత్రమే నిద్రపోతూ, మిగిలిన సమయం అంతా పనికే అంకితం చేస్తానని కిరణ్ కుమార్ తెలిపారు. తన గతాన్ని, కష్టాలను ఎప్పుడూ మర్చిపోకుండా, ప్రతిరోజూ దానిని గుర్తుంచుకుంటూనే ముందుకు సాగడమే తన విజయ రహస్యమని ఆయన అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..