
నటుడు ఏవీఎస్ పూర్తి పేరు ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు రంగస్థల కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘మిస్టర్ పెళ్లాం’ సినిమాతో నటుడిగా మారారు. మొదటి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నారు. మాయలోడు, మా విడాకులు, శుభలగ్నం, ఘటోత్కచుడు, శుభలగ్నం, యమలీల, సమరసింహారెడ్డి, ఇంద్ర, యమగోల మళ్లీ మొదలైంది.. ఇలా దాదాపు 500 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు ఏవీఎస్. 90వ దశకంలో స్టార్ కమెడియన్లుగా వెలిగిపోతోన్న బ్రహ్మనందం, అలీలకు ఏవీఎస్ గట్టి పోటీ ఇచ్చారని చెప్పవచ్చు. ఏవీఎస్ కేవలం నటుడిగానే కాకుండా రైటర్ గా, నిర్మాతగా, దర్శకుడిగా, పాటల రచయితగా కూడా సత్తా చాటారు. సూపర్ హీరోస్ సినిమాలో హీరోగా కూడా చేశారు. తన నటనతో కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఏవీఎస్ 2013లో కన్నుమూశారు.
కాగా ఇటీవల బ్యాండ్ మేళం సినిమా ఈ వెంట్ కు ఏవీఎస్ కూతురు శాంతి శ్రీనివాస్ హాజరయ్యారు. అదే సినిమా ఈవెంట్ కు డైరెక్టర్ కేఎస్ రవీంద్ర (బాబీ) కూడా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఏవీఎస్ కూతురిపై ప్రశంసల వర్షం కురిపించారు. తన తండ్రిని కాపాడుకునేందుకు ఆమె తన కాలేయాన్ని దానం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ బాగా ఎమోషనల్ గా మాట్లాడారు. బాబీ మాటలు విన్న ఏవీఎస్ కూతురు కూడా తన తండ్రిని గుర్తు తెచ్చుకుని బాగా ఎమోషనలైంది. కాగా అంతకు ముందు ఓ సందర్భంలో తన తండ్రి మరణం గురించి ఓ సందర్భంలో శాంతి మాట్లాడింది. నిరంతరం షూటింగ్ లోనే ఉండడం నిద్రను పట్టించుకోకపోవడం వల్లే తన తండ్రి ఆరోగ్యం దెబ్బతిని మరణించారని చెప్పుకొచ్చింది. అయితే తాగడం వల్లే ఆయన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని అపార్థం చేసుకున్నారని ఆమె వాపోయిది.
‘ 2008లో నాన్నకు కాలేయం పాడైంది. రక్తపు వాంతులు చేసుకున్నాడు. ఆ సమయంలో ఆయనకు కాలేయం మార్పిడి చేయాలని డాక్టర్స్ చెప్పారు. నేను కాలేయం ఇవ్వడానికి రెడీ అయ్యాను.. కానీ లావుగా ఉన్నానని నాది సెట్ కాదన్నారు. దాత దొరకాలంటే కనీసం ఏడాదైనా పడుతుందని అన్నారు. మరోవైపు నాన్ ఆరోగ్యం దిగజారింది. క్రమంగా జ్ఞాపకశక్తి కోల్పోయారు. ఎవరిని గుర్తుపట్టలేకపోయారు. ఆయనను ఐసీయులో ఉంచి మమ్మల్ని వెళ్లిపోమన్నారు. అయితే అనూహ్యంగా ఆ తర్వాత రోజు ఉదయమే నాన్న కాల్ చేశాడు. ఆయనకు జ్ఞాపకశక్తి ఎలా తిరిగి వచ్చిందో అర్థం కాలేదు. 20 రోజుల్లో కాలేయం ఆపరేషన్ చేయాలన్నారు. దీంతో నా కాలేయం ఇవ్వడానికి రెడీ అయ్యాను. అందుకు నాన్న ఏ మాత్రం ఒప్పుకోలేదు. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయని అన్నారు. కానీ ఆ తర్వాత నా భర్త ఒప్పించాడు. నా కాలేయంలో 60 శాతం దానం చేశాను. అయితే ఆపరేషన్ తర్వాత ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని చెబితే నాన్న వినకుండా షూటింగ్స్ కు వెళ్లిపోయారు. దీంతో ఆపరేషన్ అయిన ఆరేళ్లకు నాన్న పరిస్తితి విషమించి నా చేతిలోనే రక్తం కక్కుకుని చనిపోయారు’ అని చెప్పుకొచ్చింది ఏవీఎస్ కూతురు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.