
భారతీయ చలనచిత్ర చరిత్రలో కొన్ని సినిమాలు క్లాసిక్స్గా నిలిచిపోతాయి. అలాంటి వాటిలో ‘చంద్రముఖి’ ఒకటి. అయితే, ఈ సినిమా వెనుక ఉన్న అసలు కథ, అది తెలుగులోకి వచ్చిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి చంద్రముఖి ఒక మలయాళ సినిమా ‘మణిచిత్రతాజు’కు రీమేక్. మలయాళంలో శోభన, కన్నడలో సౌందర్య, తమిళంలో జ్యోతిక ఈ పాత్రలో మెప్పించారు. కానీ, తెలుగులోకి వచ్చేసరికి ఇది డైరెక్ట్ సినిమాగా కాకుండా డబ్బింగ్ సినిమాగా ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న కారణాలను సినీ విశ్లేషకులు చిలకగట్టు శ్రీకాంత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
చంద్రముఖి కథ మదు ముట్టం అనే రచయిత రాసింది. మలయాళ దర్శకుడు ఫాజిల్ ఒకరోజు తన ఆఫీసులో పాత ఫైళ్లను వెతుకుతుండగా, ఏడేళ్ల క్రితం ఒక రచయిత ఇచ్చిన కథ కనిపించింది. అదే ‘నాగవల్లి’ కథ. ఆ కథ ఆయనను ఎంతగానో ఆకట్టుకోవడంతో, వెంటనే మదు ముట్టంను పిలిపించి ‘మణిచిత్రతాజు’గా తెరకెక్కించారు. మలయాళంలో మోహన్ లాల్, శోభన, సురేష్ గోపి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్కడ సంచలన విజయం సాధించడమే కాకుండా, శోభనకి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా తెచ్చిపెట్టింది. అప్పట్లోనే ఈ సినిమా తెలుగులో ‘ఆత్మరాగం’ పేరుతో డబ్ అయింది.
తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయాలని అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆలోచన వచ్చింది. కానీ, ఇక్కడే ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. మలయాళ వెర్షన్లో హీరో పాత్ర సినిమా మొదలైన 40 నిమిషాల తర్వాత వస్తుంది. మన తెలుగు ఇండస్ట్రీలో హీరో ఇమేజ్ చాలా పెద్దది. సినిమా ప్రారంభం కాగానే హీరో కనిపించకపోతే అభిమానులు తట్టుకోలేరు. పైగా సెకండ్ హాఫ్ మొత్తం హీరోయిన్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ కారణాలతో చిరంజీవి ఈ సినిమా చేయడానికి సాహసించలేదని శ్రీకాంత్ తెలిపారు. హీరోకు తగినన్ని ఫైట్లు, పాటలు లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు.
తర్వాత ఇదే కథను తమిళంలో పి. వాసు రజనీకాంత్కి తగ్గట్టుగా మార్పులు చేసి ‘చంద్రముఖి’గా తెరకెక్కించారు. రజనీకాంత్ ఇమేజ్కు తగ్గట్టుగా ఇంట్రడక్షన్ సాంగ్, ఫైట్లు జోడించి సినిమాను కమర్షియల్ హిట్ చేశారు. తమిళంలో ఈ సినిమా భారీ విజయం సాధించడంతో, తెలుగులో కూడా అదే పేరుతో డబ్ చేశారు. ఆశ్చర్యకరంగా ఇక్కడ కూడా చంద్రముఖి రికార్డులు సృష్టించింది. ఒకవేళ చిరంజీవి ఆనాడు ఈ సినిమా చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదో చెప్పలేం కానీ, రజనీకాంత్ మాత్రం చంద్రముఖిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.