
బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీవస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు పదో సీజన్ కోసం రెడీ అవుతున్నాడు. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోకు మరిన్ని హంగులు దిద్దనున్నారు. కంటెస్టెంట్ల ఎంపిక మొదలు, గేమ్స్, టాస్కుల నిర్వహణలో విషయంలో సరికొత్త పద్ధతులను అవలంబించనున్నారు. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి వరుసగా ప్రోమోలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అలాగే హౌస్ లో కామన్ కంటెస్టెంట్స్ ఎంపిక కోసం అగ్ని పరీక్ష 2 ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్ల ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పలువురి సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, ఎక్స్ప్రెస్ హరి, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ వైఫ్ జ్యోతి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నందూస్ వరల్డ్ అలియాస్ నందు, రాయల్ ఎంసీ రమణ, శివ్, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, రైటర్ కడలి సత్యనారాయణ, వర్ష, పవిత్ర, వర్షిణీ.. ఇలా చాలా మంది సెలబ్రిటీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు గతంలో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన వారు కూడా మళ్లీ ఈ షోలోకి అడుగు పెట్టే అవకాశముందని తెలుస్తోంది.
అయితే ఈ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో గురించి ప్రముఖ యాంకర్, నటి హరితేజ గతంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పలు సినిమాలు, సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ రెండు సార్లు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది. బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొన్న హరితేజ బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చింది. కప్పు కొట్టకపోయినా తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ అభిమానుల మనసులు గెల్చుకుంది. ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన హరితేజ బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘ బిగ్ బాస్ మొదటి సీజన్ హైదరాబాద్ లో జరగలేదు. ముంబై సమీపంలో ఉన్న లోనావాలాలో జరిగింది. అక్కడ శివారులో ఉన్న ఓ అడవిలో బిగ్ బాస్ సెట్ వేశారు. అక్కడ రాత్రి అయితే పులుల శబ్దాలు వినిపించేవి. అప్పుడప్పుడు హౌస్ లోకి పాములు కూడా వచ్చేవి. అయితే ఇప్పుడు బిగ్ బాస్ షో చూడడం మానేశాను. రెండు సార్లు వెళ్లిన తర్వాత ఆ రియాలిటీ షోపై ఇంట్రెస్ట్ పోయింది. చిరాకు కూడా వచ్చేసింది’
‘ ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 8 తర్వాత నా ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. చాలా మంది నా మీద అకారణంగా ద్వేషం చూపించారు. దీంతో నేను డిప్రెషన్ బారిన పడ్డాను. కోలుకోవడానికి చాలా టైమ్ పట్టింది. ఈ కారణంగానే ఇంకోసారి బిగ్ బాస్ షోకు వెళ్లదల్చుకోలేదు’ అని హరి తేజ చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి