
సీనియర్ ఎన్టీఆర్ దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్నప్పుడు ఓ ఆసక్తికర అనుభవం ఎదురైందని నటుడు వేణు మాధవ్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రాత్రి లైట్ వెలిగించినందుకు ఎన్టీఆర్ తనను మందలించినప్పటికీ, అరగంట తర్వాత తన దోశను పంచుకొని, తప్పును సరిదిద్దుకోమని సూచించారన్నారు.
వివరాల్లోకి వెళ్తే..! టాలీవుడ్ నటుడు వేణు మాధవ్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు పంచుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్నప్పుడు ఎదురైన ఒక అరుదైన అనుభవాన్ని తెలిపారు. ఒక రాత్రి 3 గంటలకు లైట్ వెలిగించినందుకు, అన్నగారు పిలిచి తీవ్రంగా మందలించారన్నారు. విద్యుత్ వృథా గురించి వివరించి, “బుద్ధిలేదు” అంటూ ఒక దెబ్బ వేసి, అక్కడినుండి వెళ్ళిపొమ్మని ఆదేశించారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన వేణు మాధవ్ను PAలు, PSలు కూడా మందలించారట.
అరగంట తర్వాత అన్నగారు తిరిగి పిలుస్తున్నారని తెలియగానే, మరింత మందలింపు తప్పదని భావించి లోపలికి వెళ్లారట వేణు మాధవ్. కానీ ఊహించని విధంగా, అన్నగారు దోశ తింటూ కనిపించారు. “మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదు” అని సూచిస్తూ, తాను తింటున్న దోశలో సగం తీసి వేణు మాధవ్కు అందించారట. దెబ్బలు పడతాయనుకున్న వ్యక్తికి దోశ పెట్టి పంపిన ఆ అనుభవం, ఎన్టీఆర్ గొప్ప ఆత్మీయతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. అటు నటుడు రాజా రవీంద్ర.. వేణు మాధవ్ సొంతంగా సినిమా తీసి పలు ఆర్ధిక ఇబ్బందులు ఎడుర్కున్నాడని గతంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వేణుమాధవ్ సొంత సినిమా తీసి సుమారు మూడు కోట్ల రూపాయల వరకు నష్టపోయారని, దాని వల్ల నెలవారీ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడిందని ఆయన వెల్లడించారు.