
సుశాంత్ సింగ్ గురించి మరోసారి భావోద్వేగ పోస్ట్ చేశారు సోదరి శ్వేతా సింగ్ కిర్తి. త్వరలోనే తనను కలుస్తానని చెప్పిన తన తమ్ముడు.. శాశ్వతంగా దూరమయ్యాడంటూ సుశాంత్ ఙ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రోజూ నిన్ను చూడాలన్న ఆశతోనే లేస్తున్నానన్న శ్వేతా.. సోదరుడితో తన అనుభవాలను గుర్తు తెచ్చుకున్నారు.
”అమ్మానాన్నలు మొదట్లో కొడుకు కావాలనుకున్నారు. అనుకున్నట్లుగా మొదటి సంతానంగా బాబు జన్మించాడు. కానీ ఏడాదిన్నరకే మరణించాడు. ఆ తరువాత మళ్లీ కొడుకు పుట్టాలని ఎన్నో పూజలు చేశారు. రెండేళ్ల తరువాత దీపావళి రోజున నేను పుట్టా. నన్ను లక్ష్మీదేవి ప్రసాదంగా భావించి గారాబంగా పెంచారు. ఆ తరువాత నా తమ్ముడు పుట్టాడు.అందమైన చిరునవ్వు, కళ్లల్లో మెరుపులు,ముద్దు ముద్దుగా ఉండే ముఖంతో నా తమ్ముడు ఈ లోకంలోకి వచ్చాడు. అక్కగా వాడిని బాగా చూసుకోవడాన్ని నా బాధ్యతగా భావించేదాన్ని. ఇద్దరం కలిసి స్కూల్కు వెళ్లేవాళ్లం. తను యూకేజీలో ఉన్నప్పుడు అర కిలోమీటరు నడిచి లంచ్బ్రేక్లో నన్ను చూసేందుకు వచ్చాడు. నాతోనే ఉంటానని మారాం చేశాడు. అప్పుడు టీచర్లకు తెలీకుండా వాడిని దాచిపెట్టాను.
2007లో నాకు పెళ్లై అమెరికాకు వెళుతున్నప్పుడు సుశాంత్ నన్ను గట్టిగా హత్తుకొని, బిగ్గారగా ఏడ్చాడు. భౌతికంగా దూరమైనప్పటికీ మా మనసులు దూరం కాలేదు. కెరీర్ పరంగా ఇద్దరం బిజీ అయ్యాము. బాలీవుడ్ హీరోగా సుశాంత్ మమ్మల్ని గర్వపడేలా చేశాడు. జూన్ 10న అమెరికాకు రమ్మని సుశాంత్ని కోరాను. అక్కడికి రావాలని మనసు ఉబలాటపడుతోంది అక్కా అని సుశాంత్ సమాధానం ఇచ్చాడు. వచ్చి ఒక నెల రోజులు ఇక్కడే ఉండు బావుంటుంది అని చెప్పాను. కానీ ఈ లోపే ఆత్మహత్య చేసుకొని నాకు, కోట్లాది మంది అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. ఇది పీడకల అయితే బావుండేది” అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా సుశాంత్ చిన్న నాటి ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా గత నెల 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. ఆయన మరణించి నెలన్నర గడుస్తున్నా.. కుటుంబ సభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.