ప్రముఖ హీరోయిన్ ఇంట్లో వ్యాపారవేత్త మృతదేహం.. ఏం జరిగిందో?
Actress Krishi Thapanda: ప్రముఖ నటి ఇంట్లో ఓ వ్యాపారి మృతదేహం కలకలం రేపింది. బెంగళూరులో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. డిప్రెషన్తో బాధపడుతున్న ఓ వ్యాపారవేత్త కన్నడ నటి కృషి తపండ నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజరాజేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో..

బెంగళూరు, జూన్ 26: ప్రముఖ కన్నడ నటి కృషి తపండా ఇంట్లో ఓ వ్యాపారి మృతదేహం కలకలం రేపింది. బెంగళూరులో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. డిప్రెషన్తో బాధపడుతున్న ఓ వ్యాపారవేత్త కన్నడ నటి కృషి తపండ నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజరాజేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం (జూన్ 24) రాత్రి వెలుగులోకి వచ్చింది. మృతుడిని వైశాఖ్ (33)గా గుర్తించారు. గత వారం రోజులుగా అతను నటి కృషి తపండ ఇంట్లోనే ఉంటున్నట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో కృషి తపండ యలహంక ప్రాంతంలో ఉంది. అదే రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో వైశాక్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.
ప్రాథమిక దర్యాప్తులో వైశాక్ కొంతకాలంగా డిప్రెషన్కు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలతో అతను మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. భార్యతో తరచూ తలెత్తిన విభేదాల కారణంగా గత నెల రోజులుగా విడిగా నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రముఖ కన్నడ నటి కృషి తపండాకు వైశాఖ్ స్నేహితుడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అతడు నటి ఇంట్లో వారం రోజులుగు ఉంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, వైశాఖ్ గతంలో ఓ సంచలన బెదిరింపు లేఖ కేసులో కూడా వార్తల్లో నిలిచాడు. వ్యాపారవేత్త, న్యాయవాది అరవింద్ రెడ్డికి రూ.6 నుంచి రూ.7 కోట్ల డిమాండ్తో పాటు క్షమాపణ కోరుతూ ఫిబ్రవరిలో ఓ బెదిరింపు లేఖ పంపిన కేసులో అతనిపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హెచ్ఏఎల్ పోలీసులు వైశాఖ్ను అరెస్ట్ చేసి విచారించిన అనంతరం విడుదల చేశారు. అయితే, ఫిబ్రవరి 6న కర్ణాటక హైకోర్టు వైశాఖ్పై తదుపరి దర్యాప్తును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు అతడిని ఈ కేసు విషయంలో ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉంచి విచారించారు. వైశాఖ్ మృతిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. రాజరాజేశ్వరి నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. మరణానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

ఈ వ్యవహారంలో కన్నడ నటి కృషి తాపండ పేరు వార్తల్లో నిలిచింది. 2014లో మిస్ కర్ణాటకగా గెలిచిన కృషి తాపండ అకీరా అనే మువీతో సినీ రంగంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా పలు కన్నడ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. అన్నట్లు కన్నడ బిగ్ బాస్ సీజన్ 5లో కూడా కృషి అలరించింది.
