పొలిటిక‌ల్ హీట్ పెంచుతున్న నాగార్జున సాగ‌ర్ ఉపఎన్నిక.. ప్రధాన పార్టీల్లో రసవత్తర పోరు.. బరిలోకి వైసీపీ అభ్యర్థి

|

Mar 27, 2021 | 7:20 AM

ఏప్రిల్ 17 న జరిగే నాగార్జున సాగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఉపఎన్నిక వేడి రాజుకుంది. విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

పొలిటిక‌ల్ హీట్ పెంచుతున్న నాగార్జున సాగ‌ర్ ఉపఎన్నిక.. ప్రధాన పార్టీల్లో రసవత్తర పోరు.. బరిలోకి వైసీపీ అభ్యర్థి
Follow us on

Nagarjuna sagar bypoll 2021: ఏప్రిల్ 17 న జరిగే నాగార్జున సాగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఉపఎన్నిక వేడి రాజుకుంది. విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సాగర్ పీఠానే తామే దక్కించుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. దుబ్బాక మాదిరే సాగర్‌లోనూ టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఈసారి ఎలాగైనా గెలిచి పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ పార్టీ నుంచి సీనియర్ నేత జానా రెడ్డి బరిలో ఉన్నారు. ముందు నుంచీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ తరుఫున పార్టీ సీనియర్ మహిళా నేత నివేదితా రెడ్డిని బరిలోకి దింపింది. ఇక అధికార టీఆర్‌ఎస్ తమ అభ్యర్థిని ప్రకటిచాల్సి ఉంది. మరోవైపు, ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభమయింది. పలువురు ఇండిపెండెంట్లు సైతం నామినేషన్లు వేశారు. అయితే, వైసీపీ అభ్యర్థి కూడా నామినేషన్ వేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

నల్లొండ జిల్లా నాగార్జున సాగర్ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఇప్పటికే పలువురు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అందులో అత్యధికంగా స్వతంత్ర అభ్యర్థులు కాగా.. బీజేపీ, వైసీపీ అభ్యర్థి కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య కొన్నేళ్లుగా స్నేహ బంధం కొనసాగుతోంది. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా నేరుగా పోటీ చేకుండా.. వైసీపీ మద్దతు ఇస్తోందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. కానీ అనూహ్యంగా సాగర్ ఉపఎన్నికల్లో వైసీసీ అభ్యర్థి నామినేషన్ వేయడం చర్చనీయాంశమయింది. టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చేందుకే వైసీపీ ఈ నిర్ణయం తీసుకుందని కొందరు నేతలు చెబితే.. ఓట్లను చీల్చి ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చేందుకు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలావుంటే, సాగర్ ఉపఎన్నికల్లో 400 మంది అమరవీరుల కుటుంబ సభ్యులు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. అమవీరుల ప్రాణ త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని.. కానీ స్వరాష్ట్రం వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా వారి కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకోలేదని తెలంగాణ అమరువీరుల ఫోరం మండిపడింది. కేసీఆర్‌ తీరుకు నిరసనగా సాగర్‌లో నామినేషన్ వేస్తున్నట్లు వెల్లడించింది. తెలంగాణ వచ్చాక అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. కానీ ఇప్పటి చాలా కుటుంబాలకు ఒక్క రూపాయి ఆర్థిక సాయం కూడా అమరవీరుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, ప్రధాన పార్టీల అభ్యర్థులపై క్లారిటీ వస్తుంది. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. బీజేపీ తరపున నివేదిత రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాగా, వైసీపీ తరఫున అభ్యర్థి బరిలో నిలుస్తున్నారు.

నాగార్జున సాగర్ ఉపఎన్నికకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల దాఖలు కొనసాగుతుంది. మార్చి 30 వరకు నామినేషన్లకు గడువు ఉంది. అయితే, మార్చి 27, 28, 29 తేదీలను ఈసీ సెలవుగా ప్రకటించడంతో.. మార్చి 25, మార్చి 30న మాత్రమే నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ అభ్యర్థులపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈనెల 31వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ చేశారు. ఏప్రిల్ 3 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఏప్రిల్ 17న పోలింగ్ జరుగుతుంది. మే 2న ఐదు రాష్ట్రాల ఫలితాలతో పాటే నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు.

Read also… Woman Police Officer: ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న తొలి మహిళా పోలీస్ అధికారి.. దేశ రాజధాని ఢిల్లీలో నడిరోడ్డుపై..