భర్తను 19 గంటలు టాయిలెట్‌లో వదిలేసిన భార్య..భర్త మృతి

అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో విషాదం చోటు చేసుకుంది. మార్గరెట్ రోగ్‌ అనే వృద్ధురాలు.. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన 76 ఏళ్ల భర్తను ఏకంగా 19 గంటల పాటు టాయిలెట్ సీటుపైనే వదిలేసింది. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె భర్త ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఆ వృద్ధురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు లో ఆమె చెప్పిన సమాధానాలు ఆమెను మరింత ఇరుకున పెట్టాయి. బాధితుడికి సహాయం అవసరమని తనకు తెలిసినా తను కావాలనే సహాయం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పడం విని కుటుంబసభ్యులు షాకయ్యారు! 

భర్తను 19 గంటలు టాయిలెట్‌లో వదిలేసిన భార్య..భర్త మృతి
Woman Leaves Husband In Toilet For 19 Hours

Updated on: Sep 18, 2026 | 4:23 PM

ఆ వ్యక్తి ఆగస్టు 20న మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాత్రూమ్‌కు వెళ్లి అక్కడి నుంచి లేవలేకపోయారు. రోగ్ కూడా ఆయనను పైకి లేపలేకపోయింది. దాంతో ఆహారం, నీరు, మందులు లేకుండా అలాగే టాయిలెట్‌పైనే ఆయన్ను ఆమె వదిలేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ రాత్రి ఆమె అతన్ని పట్టించుకోకుండా నిద్రపోయినట్లు తెలిసింది. ఆయన నొప్పితో మూలుగుతున్నప్పటికీ, ఆయనకు సహాయం అవసరమని రోగ్‌కు తెలిసినా.. అయినా ఆమె ఎవరికీ ఫోన్ చేసి సహాయం కోరలేదని ప్రాసిక్యూటర్లు కోర్టు పత్రాల్లో స్పష్టం చేశారు.

మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన స్పీచ్ థెరపిస్ట్..  ఆ వ్యక్తి ఎటువంటి స్పందన లేకుండా తీవ్ర అనారోగ్యంతో ఉండటాన్ని గమనించారు. వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా.. గుండె, శ్వాసకోశ వైఫల్యాలతో పాటు, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, రక్తంలో సోడియం స్థాయిలు పెరగడం, సెప్సిస్ ఇంకా రాబ్డోమయోలిసిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. అధికారుల ప్రకారం.. ఆయన శరీర వెనుక భాగంలో గాయాలు ఉండటంతో పాటు మానసిక స్థితిలో కూడా మార్పులు వచ్చాయి. చివరకు ఆసుపత్రిలో పది రోజుల పాటు పోరాడిన ఆయన తుదిశ్వాస విడిచారు. వృద్ధుడిని వేధింపులకు గురి చేయడం, నిర్లక్ష్యం వంటి తీవ్రమైన అభియోగాల కింద 75 ఏళ్ల మార్గరెట్ రోగ్‌పై మొనాన్గాలియా కౌంటీ షెరీఫ్ కార్యాలయం కేసు నమోదు చేసింది.

తెలిసినా కావాలనే సహాయం చేయలేదన్న నిందితురాలు

టాయిలెట్‌పైనే ఎక్కువ గంటలు వదిలేయడం వల్ల ఏర్పడిన తీవ్రమైన పరిస్థితులు, గాయాలే ఆయన మరణానికి ప్రధాన కారణమయ్యాయని దర్యాప్తులో స్పష్టమైనట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్లక్ష్య ఘటనకు సంబంధించి ఆ వృద్ధురాలిపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే, తనపై వచ్చిన నేరాన్ని రోగ్ అంగీకరించలేదు. దర్యాప్తు సమయంలో రోగ్.. పోలీసు అధికారులు, అడల్ట్ ప్రొటెక్షన్ సర్వీసెస్ సిబ్బంది, కుటుంబ సభ్యుల ముందు చేసిన కొన్ని ప్రకటనలు ఆమెను ఇరుకున పెట్టాయి. బాధితుడికి సహాయం అవసరమని తనకు పూర్తిగా తెలుసని, అయినప్పటికీ ఆమె కావాలనే సహాయం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆ ప్రకటనల ద్వారా స్పష్టమైందని కోర్టు పత్రాల్లో రాశారు.  ప్రస్తుతం మార్గరెట్ రోగ్ ‘నార్త్ సెంట్రల్ రీజినల్ జైలు’లో ఉన్నారు. ఆమెకు 75,000 డాలర్ల పూచీకత్తును కోర్టు నిర్ణయించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us