అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త వేదించడం మొదలుపెట్టాడు. దీంతో నిత్యం వేదిస్తున్న భర్తను అతి దారుణంగా హత్య చేసింది భార్య. వనపర్తిజిల్లా పెద్దమందండి మండలం స్కూల్ తండాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్యాతండాకు చెందిన మెగావత్ బాల్య నాయక్, భార్య మణెమ్మతో కలిసి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు.
అయితే లాక్డౌన్ విధించడంతో ఏ పని దొరకలేదు. దీంతో హైదరాబాద్ నుంచి దంపతులిద్దరూ సొంత తండాకు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి బాల్యనాయక్ కు భార్య మణెమ్మపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య పలు మార్లు గొడవలు జరిగాయి. భర్తతో నిత్యం జరుగుతున్న గొడవలతో విసుగు చెందిన భార్య మణెమ్మ నిద్రిస్తున్న భర్త బాల్య నాయక్ గొంతు కోసి హత్య చేసింది. ఈ హత్యలో కూతురు ప్రమేయం కూడా ఉందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.