ఏపీలో క్షుద్రపూజలు మరోసారి కలకలం రేపాయి. మూఢనమ్మకాలు నమ్మకండి అంటూ అందరిలో సామాజిక స్పృహను కల్పించాల్సిన ఉపాధ్యాయుడే స్కూల్లో క్షుద్రపూజలు చేయించాడు. ఓ విద్యార్థిని చెవి కమ్మలు పోయాయన్న కారణంతో ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులతో క్షుద్రపూజలకు ప్రారంభించాడు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని సి.వడ్డెపల్లి స్కూల్లో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఓ విద్యార్థిని చెవికమ్మలు పోగా.. ఆ విషయం తెలుసుకున్న రవి కుమార్ అనే ఉపాధ్యాయుడు క్షుద్రపూజలు చేయించాలనుకున్నాడు. మంత్రగాడిని పిలిపించి అంజనం వేయిస్తే దొంగ దొరుకుతాడని, అందుకు ఆదివారం తలస్నానం చేసి అందరూ స్కూలుకు రావాలని విద్యార్థులకు చెప్పాడు. దీంతో విద్యార్థులందరూ స్కూలుకు వెళ్లారు. అప్పటికే రమణ అనే మంత్రగాడిని తీసుకొచ్చిన టీచర్ రవి కుమార్.. విద్యార్థుల చేతి గోళ్లపై పసరు రాసి పూజ ప్రారంభించాడు. అదే సమయంలో ఓ విద్యార్థి తాత స్కూలుకు వచ్చి.. అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూశాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటూ టీచర్ రవి కుమార్ను ప్రశ్నించాడు. దీంతో వారిద్దరు కాస్త కంగారు పడ్డారు. మరోవైపు విషయం తెలిసిన గ్రామస్థులు అక్కడకు చేరుకోవడంతో మంత్రగాడు రమణ పరారయ్యాడు. ఆ తరువాత ఉపాధ్యాయుడిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అక్కడికి చేరుకున్న వారు రవి కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. తమకు ఏదో ఆకు పసరు పూశారని, ఆ తర్వాత తల తిరిగినట్టు అయిందని విద్యార్థులు తెలిపారు. ఇక ఈ విషయంపై ఎంఈవో చక్రేనాయక్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణ జరిపించి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు చిన్నపిల్లలపై ఇలాంటి చర్యలు సరికాదని పై అధికారులు సీరియస్ అవుతున్నారు.