AP Crime News: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బాదినేని పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తాను ప్రేమించిన వ్యక్తి తన ప్రేమను నిరాకరించాడనే కారణంతో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకెళితే.. బాదినేనిపల్లి ఎస్సీ పాలెం కు చెందిన మైనర్ బాలిక (16) కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అదే కాలేజీలో చదువుతున్న ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని కాస్తా యువతి ప్రేమగా భావించింది. ఈ నేపథ్యంలోనే అతన్ని డీప్గా లవ్ చేసింది. ఇదే విషయాన్ని సదరు యువకుడికి తెలియజేయగా.. అతను నిరాకరించాడు. యువకుడు తన ప్రేమను నిరాకరించడంతో.. బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ వైరాగ్యంతోనే.. బాదినేని పల్లి గ్రామ సమీపంలోని పులివాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలియని బాలిక తల్లిదండ్రులు.. తమ కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు.
ఇవాళ గ్రామ సమీపంలోని వాగులో శవమై తేలడంతో బాలిక తల్లిదండ్రులు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించారు ఆ తల్లిదండ్రులు. బాలిక మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వాగులోంచి బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తెను సదరు యువకుడే హత్య చేశాడంటూ ఆరోపిస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో.. పోస్టుమార్టం అనంతరం వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, ప్రేమ నిరాకరణ కారణంగా బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
Also read: