ACB Raids: ఉత్తరాంధ్ర ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి వస్తున్న సంచలనాలు.. మూడు రోజులుగా 12 రెవెన్యూ కార్యాలయాల్లో సోదాలు..!

|

Jul 22, 2021 | 8:55 AM

ఉత్తరాంధ్రలో ఏసీబీ తనిఖీలు ప్రకంపనలు రేపుతున్నాయి. మూడు రోజులుగా రెండు జిల్లాల్లోని 12 రెవెన్యూ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.

ACB Raids: ఉత్తరాంధ్ర ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి వస్తున్న సంచలనాలు.. మూడు రోజులుగా 12 రెవెన్యూ కార్యాలయాల్లో సోదాలు..!
Acb Raids Mandal Offices In Andhra Pradesh
Follow us on

ACB raids AP Mandal offices: ఉత్తరాంధ్రలో ఏసీబీ తనిఖీలు ప్రకంపనలు రేపుతున్నాయి. మూడు రోజులుగా రెండు జిల్లాల్లోని 12 రెవెన్యూ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఏడాది నుంచి జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించాక ఈ రెండు జిల్లాల రూరల్‌ ప్రాంతాల్లోని రెవెన్యూ కార్యాలయాల్లో అనేక అవకతవకలు జరిగినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో సోదాలు చేపట్టారు ఏసీబీ అధికారులు.

విశాఖలోని ఆరు మండలాలు, విజయనగరంలోని ఆరు మండలాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. విశాఖలోని పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, అచ్యుతాపురం, విశాఖ అర్భన్‌, విశాఖ రూరల్‌ మండల కార్యాలయాల్లో సోదాలు చేశారు. మొత్తం ఆరు బృందాలు.. ఆరు రెవెన్యూ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు.

విజయనగరం జిల్లాలోని డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం, ఎస్‌ కోట, కొత్తవలస, జామి తహసిల్దార్‌ కార్యాలయాల్లో సోదాలు జరిపారు ఏసీబీ అధికారులు. భూ క్రయ విక్రయాల కోసం మ్యుటేషన్స్‌, డిజిటల్‌ సైన్‌, కన్వర్షన్స్‌, పాస్‌ బుక్‌ల జారీ, కుల ధృవీకరణ పత్రాల జారీ లాంటి వ్యవహారాల్లో పెద్ద ఎత్తునా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ప్రభుత్వానికి నేరుగా ఫిర్యాదులు అందాయి. 144, 100 కాల్‌సెంటర్లతో పాటు స్పందన లాంటి కార్యక్రమాల ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఏడాది నుంచి 12 రెవెన్యూ కార్యాలయాల్లో జరిగిన లావాదేవీలపై, ఆయా ఫైల్స్‌ తీసి దరఖాస్తుదారులకు నేరుగా ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు ఏసీబీ అధికారులు. దరఖాస్తు చేసిన తర్వాత రెవెన్యూ అధికారులు ఆలస్యం చేశారా ? డబ్బులు డిమాండ్‌ చేశారా ? స్థలం లాంటివి డిమాండ్‌ చేశారా ? అని దరఖాస్తుదారుల నుంచి సమాధానాలు రాబడుతున్నారు ఏసీబీ అధికారులు. వీటిపై నివేదికలు తయారు చేస్తున్నారు.

విశాఖ జిల్లా పద్మనాభపురం రెవెన్యూ కార్యాలయంలోని సర్వేయర్‌ దగ్గర 12 వేల రూపాయల అదనపు నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ డబ్బులు ఎక్కడివి? అని ఆరా తీసిన అధికారులు, ఆరోజు ఆయన్ను కలిసిన దరఖాస్తుదారులను పిలిచి విచారణ జరిపారు. మరోవైపు ఏడాది కాలంగా జరిగిన లావాదేవీలు కావడంతో రెవెన్యూ కార్యాలయాల్లో రికార్డుల పరిశీలన ఆలస్యమవుతోంది. మరోవైపు, రెవెన్యూ కార్యాలయాల్లో పూర్తి స్థాయి సోదాల తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

Read Also.. గల్లంతైన మత్స్యకారులు క్షేమం..అండమాన్‌ తీరంలో బోటు!..సిక్కోలులో ఆందోళన..:Fisherman in srikakulam Video.